నేనేమిటో చూపిస్తా:ఫర్మానాపై మొండికేస్తున్న ట్రంప్
ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ తాను జారీచేసిన ఆదేశాలను న్యాయస్థానాలు నిలిపేసినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం మానలేదు.
వాషింగ్టన్: ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ తాను జారీచేసిన ఆదేశాలను న్యాయస్థానాలు నిలిపేసినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం మానలేదు. మరింత మొండికేస్తున్నారు. ఆయా దేశాల నుంచి ఎవరూ అమెరికాలోకి ప్రవేశించకుండా సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆదేశం జారీచేస్తానని తాజాగా ప్రకటించారు. అమెరికన్లను ఉద్యోగాలనుంచి తొలగించాలని చూసే కంపెనీలపై కన్నెర్ర చేసిన ట్రంప్ తీవ్ర పరిణామాలు తప్పవని తేల్చిచెప్పారు.
'అప్పీళ్ల కోర్టులో కచ్చితంగా నెగ్గుతాం. చట్టపరంగా కాస్త ఆలస్యమవుతుంది. అయినా మేమే గెలుస్తాం' అని మీడియాతో అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలోని అప్పీళ్ల కోర్టుకు చెందిన త్రిసభ్య ధర్మాసనం.. వలసల నిషేధ ఉత్తర్వు పునరుద్ధరణకు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్, సిరియా, ఇరాక్, లిబియా, సొమాలియా, సూడాన్, యెమెన్ పౌరులు అమెరికాకు నిస్సంకోచంగా రావడానికి అవకాశం ఏర్పడింది.
త్వరలో కొత్త ఆదేశం జారీ
ఈ విషయంలో ఇంకా ఇతర మార్గాలను కూడా మేం పరిశీలిస్తున్నాం. వలసల నిషేధంపై సరికొత్త ఆదేశం తేవడం అందులో ఒకటి. భద్రతా కారణాల దృష్ట్యా మేం వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. గత ఆదేశాల పునరుద్ధరణకు నిరాకరించిన 9వ అమెరికా అప్పీళ్ల సర్క్యూట్ కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. తదుపరి చర్య తీసుకునేందుకు వేచిచూస్తాను. బహుశా సోమ, మంగళవారాల్లో కొత్త ఆదేశం జారీ కావచ్చు' అని చెప్పారు.
దేశ భద్రత కోసం రక్షణ చర్యలుదేశ భద్రత, అదనపు రక్షణ చర్యల కోసం వేగంగా నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ తెలిపారు. 'అమెరికన్లు నా వల్లే దేశం భద్రతగా ఉంటుందని విశ్వసించినందు వల్లే నేను అధ్యక్షుడిగా ఎన్నికయ్యా. మా దేశానికి పెను ముప్పులు పొంచి ఉన్నాయి, దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు అన్ని చర్యలూ తీసుకుంటాం' అని స్పష్టం చేశారు.
నేనేంటో రుచి చూపిస్తా
విదేశాలకు వ్యాపారాల్ని తరలించాలనే ఆలోచనలో ఉన్న కంపెనీలకు నిబంధనల్ని కఠినతరం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. కేవలం బై బై చెప్పి, అందర్నీ ఉద్యోగాల నుంచి తొలగించి వెళ్లిపోవడం అంత సులువు కాదనే విషయం ఆ కంపెనీలకు తెలిసేలా చేస్తానన్నారు.
పన్ను భారం తగ్గింపుపై కసరత్తు
భారీ పన్ను సంస్కరణల కోసం కసరత్తులు చేస్తున్నామని ట్రంప్ వెల్లడించారు. కార్మికులు, వ్యాపార సంస్థలపై పన్నుల భారాన్ని భారీగా తగ్గించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటెల్ సంస్థ సీఈవో బ్రియాన్ క్రజానిచ్తో తాను భేటీ అయ్యానని, అరిజోనాలో కొత్త ఉత్పత్తి కేంద్రం స్థాపనకు 700 కోట్ల డాలర్ల పెట్టుబడి పెడతామని, వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని ఆయన చెప్పినట్లు తెలిపారు.
ఇక నుంచి క్షుణ్ణంగా తనిఖీలు
వలస చట్టం అమలు కోసం పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటామని ట్రంప్ చెప్పారు. 'కొత్తగా భద్రతా చర్యలు పొందుపరుస్తాం. ఇక నుంచి చాలా క్షుణ్నంగా తనిఖీ చేయబోతున్నాం. మన దేశానికి రావాలనుకుంటున్న ప్రజలు మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేలా ఉండాలి'అని అన్నారు. అమెరికాకు అదనపు భద్రత కోసం ఏదొకటి చాలా త్వరగా చేయాలని, వచ్చేవారం వాటిని మీరు చూస్తారంటూ దీమాగా చెప్పారు. అధ్యక్షుడిగా చాలా తక్కువ సమయంలోనే అనేక విషయాల్ని నేర్చుకున్నానని తెలిపారు.