తెరపైకి 35 శాతం పన్ను: భారతీయులకు ట్రంప్ షాక్!
వాషింగ్టన్: భారత్ సహా పలు దేశాలకు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ షాకిస్తున్నారు. అమెరికాలోని నిరుద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచార పర్వం ఆరంభంలోనే ఆయన.. అమెరికన్ యువతకు ఉద్యోగాల వల వేశారు.
భారత్ వంటి దేశాలు అమెరికా యువత ఉద్యోగాలు తన్నుకుపోతున్నాయని వ్యాఖ్యానించారు. తాజాగా, మరో అంశాన్ని ముందుకు తెచ్చారు. ఓట్ సోర్సింగ్ సేవలను వినియోగించుకునే కంపెనీల పైన 35 శాతం పన్ను విధిస్తానని ట్రంప్ చెప్పారు.
ఇదే నిజమైతే భారత్ సహా పలు దేశాలకు గండిపడటం ఖాయమని అంటున్నారు. శనివారం నాడు ఫ్లోరిడాలోని టంపలోను, ఉత్తర కరోలినాలోని విల్మింగ్టన్లోను జరిగిన ప్రచార సభలో మాట్లాడారు. అమెరికా సంపద దోపిడీకి గురవుతుందన్నారు. తాను అధ్యక్షుడిని అయితే దోపిడీకి గురి కాకుండా ఆపుతానని చెప్పారు.
అందుకోసం వేగవంతమైన చర్యలు చేపడతానన్నారు. ఏదైనా కంపెనీ తన వర్కర్లను తగ్గించి, ఇతర దేశాల వారితో పని చేయించుకొని, తిరిగి ఆ ఉత్పత్తులను అమెరికాలో అమ్మడానికి తీసుకు వస్తే ఆ కంపెనీల పైన 35 శాతం పన్ను విధిస్తానని చెప్పారు.
ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ట్రాన్స్ - పసిపిక్ భాగస్వామ్యం వంటి ఒప్పందాలకు వ్యతిరేకంగా రక్షణాత్మక వాదాన్ని వినిపించారు.
వీటి వల్ల అమెరికా నుంచి ఉద్యోగాలు ఇతర దేశాలకు పోతున్నాయన్నారు. ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం వల్ల కోల్పోయిన మాన్యుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలను మళ్లీ తెస్తానన్నారు. అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా కార్పోరేట్ పన్నులను 35 శాతం నుంచి 15 శాతంకు తగ్గిస్తానని చెప్పారు.