టీచర్లూ తుపాకులు వాడాలి, పూర్తి స్థాయి శిక్షణ: ట్రంప్ సంచలనం
వాషింగ్టన్: గత కొంత కాలంగా పాఠశాలలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్న ఘటనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇటీవల ఫ్లోరిడా పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన వారితో సమాశవేమైన ట్రంప్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.
వారం క్రితం ఫ్లోరిడాలోని ఓ పాఠశాలలో ఓ మాజీ విద్యార్థి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 17మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్.. బాధితులు, విద్యార్థులతో సమావేశమయ్యారు.
విద్యార్థుల ఆవేదన, ఆందోళన
ఈ సమావేశంలో పలువురు బాధిత విద్యార్థులు తమ ఆవేదనను, ఆందోళనను అధ్యక్షుడికి తెలియజేశారు. విమానాశ్రయాల్లో వాటర్ బాటిళ్లను కూడా తీసుకెళ్లనివ్వరని.. అలాంటి పాఠశాలల్లోకి మాత్రం దుండగులు తుపాకులతో వచ్చి మారణహోం సృష్టిస్తున్నారని వాపోయారు. ప్రాణాలతో బయటపడినందుకు తాము అదృష్టవంతులమని కొందరు అన్నారు. ఫ్లోరిడా కాల్పుల ఘటనపై స్పందిస్తూ.. ప్రపంచంలో ఎవరికీ కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
నిబంధనలు కఠినతరం
తుపాకుల యజమానులకు నిబంధనలు కఠినతరం చేస్తామని, తుపాకుల జారీకి ఖచ్ఛితమైన నిబంధనలను అమలు చేస్తామని ట్రంప్ చెప్పారు. వారి మానసిక పరిస్థితిని పరీక్షించడం కూడా జరుగుతుందని తెలిపారు.
టీచర్లకూ తుపాకులు
అంతేగాక, తరచూ పాఠశాల్లలో దాడులు జరుగుతున్న దృష్ట్యా.. ఉపాధ్యాయుల వద్ద కూడా తుపాకులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం పాఠశాలలోని కొందరు ఉపాధ్యాయులకు తుపాకీ వాడకంలో శిక్షణ ఇప్పించాలని స్పష్టం చేశారు. అయితే, అది రహస్యంగా ఉండాలని చెప్పారు.
పునరావృతం కాకుండా..
కొందరు ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇచ్చి వారి దగ్గర రహస్యంగా తుపాకులు ఉంచితే.. పరిస్థితిలో కొంత మేర మార్పు వస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీని వల్ల గన్-ఫ్రీ జోన్ ఉండబోదని, గన్-ఫ్రీ జోన్ అంటే దుండగులు తుపాకులతో వచ్చి కాల్పులకు తెగబడుతున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ట్రంప్ హామీ ఇచ్చారు.