ఏపీ రొయ్యలకు ట్రంప్ టారిఫ్ షాక్.. అయోమయంలో 10 లక్షల కుటుంబాలు !
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన తాజా టారిఫ్లతో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులు మళ్లీ ఆందోళనలో పడ్డారు. గత ఏప్రిల్లో 90 రోజులపాటు టారిఫ్లను నిలిపివేయడంతో ఊపిరి పీల్చుకోగా.. ఆగస్టు 1 నుండి 25% సుంకాలు, అదనపు జరిమానాలు విధించబడతాయని ప్రకటించడంతో మరోసారి అయోమయంలో పడ్డారు.
ఏప్రిల్లో ఉపశమనం.. ఆగస్టులో సంక్షోభం..
గత ఏప్రిల్ 2న ట్రంప్ 26% టారిఫ్లు ప్రకటించడంతో అమెరికాకు రొయ్యల రవాణా ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ 9న 90 రోజులపాటు వాయిదా వేసి.. ఆ సమయంలో 10% సాధారణ టారిఫ్ను కొనసాగించారు. ఈ విరామం కారణంగా ఏపీ రైతులు, ఎగుమతిదారులు వనామీ వంటి రొయ్యల రకాలను తిరిగి అమెరికాకు పంపడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు 25% అదనపు సుంకాలు విధించడంతో అమెరికా మార్కెట్లో పోటీ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోనుంది.

ఆక్వా రంగం వెన్నెముక..
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో సుమారు రెండు లక్షల హెక్టార్లలో రొయ్యల సాగు సాగుతోంది. ఈ రంగంపై నేరుగా, పరోక్షంగా 10 లక్షలకు పైగా కుటుంబాలు ఆధారపడుతున్నాయి. పల్లెల్లో ఆక్వా ఫార్ములు, ఐస్ ప్లాంట్లు, ఫీడ్ సప్లై చైన్, రవాణా సేవలు, ప్రాసెసింగ్ యూనిట్లు- ఇవన్నీ ఈ రంగంతో ముడిపడి ఉన్నాయి.
ఎగుమతుల్లో ఏపీ టాప్..
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికాకు $2.55 బిలియన్ విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసింది. అందులో 92% వాటా రొయ్యలదే. భారతదేశం మొత్తం రొయ్యల ఎగుమతుల్లో దాదాపు 75% ఏపీ నుంచే వస్తున్నాయి. అమెరికా ఏపీ రొయ్యలకు ప్రధాన మార్కెట్ కావడంతో అక్కడ టారిఫ్లు పెరగడం రాష్ట్రానికి ఆర్థికపరంగా గట్టి దెబ్బ అవుతుంది.

అమెరికా మార్కెట్లో భారమైన సవాళ్లు..
- ఇప్పటికే భారతీయ ఎగుమతిదారులపై 5.77% Countervailing Duty (CVD) ఉంది.
- కొత్తగా విధించిన 25% టారిఫ్తో కలిపి, ఇతర సుంకాలను పరిగణనలోకి తీసుకుంటే, భారత్ మొత్తం మీద 20% వరకు డ్యూటీ డిసాడ్వాంటేజ్ ఎదుర్కొంటుంది.
- ఇది ఎక్వెడార్, వియత్నాం వంటి పోటీ దేశాలకు లాభదాయకం అవుతుంది. వారికి తక్కువ సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పందాల ప్రయోజనం కలిసి వస్తుంది.
ఈ కారణంగా రైతులు, ఎగుమతిదారుల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధిక టారిఫ్ల కారణంగా అమెరికా మార్కెట్లో రొయ్యల ధర పోటీ శక్తి తగ్గిపోవడం. నిల్వ ఖర్చులు, ప్రాసెసింగ్ ఖర్చులు పెరగడం వల్ల రైతులు నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు. అయితే నిపుణుల మాత్రం కొత్త మార్కెట్ల అన్వేషణపై ఫోకస్ చేయాలని అంటున్నారు.












Click it and Unblock the Notifications