మతిమరుపు భారత్కు మళ్లీ గుణపాఠం చెప్పాలి: చైనా తీవ్రవ్యాఖ్యలు
భారత్కు వ్యతిరేకంగా చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వరుస కథనాలు ప్రచురిస్తోంది. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ జాన్ కాంగ్ ఓ ఆర్టికల్ రాశారు.
బీజింగ్: భారత్కు వ్యతిరేకంగా చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వరుస కథనాలు ప్రచురిస్తోంది. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ జాన్ కాంగ్ ఓ ఆర్టికల్ రాశారు.
చదవండి: చిన్న గొడవ కాదు: చైనా, భారత్ ఊహించని షాక్.. అందుకే అలా బెదిరింపు
మతిమరుపు భారత్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు
ఇందులో మతిమరుపు భారత్కు మరోసారి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని రాయడం గమనార్హం. రాజీకి భారత్ నిరాకరిస్తున్నందున దానికి రెండోసారి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఇదేనని రాశారు. డొక్లాంలో భారత బలగాలను స్వచ్చంధంగా వెనక్కి తీసుకోవాలని, లేదంటే వారిని నిర్బంధించాలని అక్కసు వెళ్లగక్కారు.
హద్దుమీరితే అంటూ తీవ్ర వ్యాఖ్యలు
లేదంటే సరిహద్దు వివాదాలు తీవ్రతరమైతే వారిని చంపవచ్చునని హద్దు మీరి రాశారు. చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీ వైఖరిని ఈ పత్రిక కళ్లకు కడుతుందని అంటారు. భారత్-భూటాన్ బంధం తరహాలో చైనా-పాకిస్తాన్ బంధాన్ని పోలుస్తూ పాక్ ఆహ్వానంపై మూడో దేశం కాశ్మీర్లోకి చక్కగా ప్రవేశించవచ్చునని కూడా రాసారు.
దోవల్ పైన అనుచిత వ్యాఖ్యలు
భారత్-చైనాల మధ్య నెలకొన్న డొక్లాం సరిహద్దు వివాదానికి తెర తీసిన ప్రధాన సూత్రధారుల్లో భారత్కు చెందిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కారణమని కూడా చైనా మీడియా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
భారత్ మీడియా నమ్మకాలు పెట్టుకుందని
'సిక్కిం సరిహద్దులో భారత్- చైనా భద్రతా బలగాలు ఉండటానికి ప్రధాన సూత్రధారుడు దోవల్. కానీ దోవల్ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన సద్దుమణిగే అవకాశం ఉందని భారత్ మీడియా ఎక్కువగా నమ్మకాలు పెట్టుకుంటోంది. సరిహద్దు వివాదంపై బీజింగ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ విషయంలో ఆయనకు నిరాశే ఎదురవుతుంది. భారత్ అనుకున్నట్లుగా ఇరు దేశాల మధ్య దోవల్ పర్యటన వల్ల పరిస్థితులు చక్కబడే అవకాశం లేద'ని తన కథనంలో పేర్కొంది.
భ్రమలు వీడాలంటూ
బ్రిక్స్ కూటమి జాతీయ భద్రతా సలహాదారుల(ఎన్ఎస్ఏ) సమావేశానికి దోవల్ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాలకు చెందిన అధికారులు మాట్లాడుకోవచ్చని భావిస్తున్నారు. అయితే చైనా మాత్రం అందుకు సముఖంగా కనిపించడం లేదు. ఈ సమావేశంతో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతాయనే భ్రమలను భారత్ వీడాలంటూ చైనా రక్షణశాఖ సోమవారం స్పష్టం చేసింది.