
Dubai Flights: ఛలో దుబాయ్: భారత్ నుంచి విమానాలు రీస్టార్ట్..డేట్ ఫిక్స్: కండిషన్స్ అప్లై
దుబాయ్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన సంక్షోభ పరిస్థితులు సమసిపోయేంత వరకూ ఒక్క విమానాన్ని కూడా నడిపించలేదు. వాయు మార్గాలను మూసివేశాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి దేశాలు భారత్కు విమాన సర్వీసులను నిలిపివేశాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు వస్తోన్నాయి.
Recommended Video
దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ తగ్గిపోతోండటంతో విమాన సర్వీసులను పునరుద్ధరించడానికి సిద్ధపడుతోన్నాయి. ఈ విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందడుగు వేసింది. భారత్తో తమ విమాన సర్వీసులను పునరుద్ధరించబోతోన్నట్లు ప్రకటించింది. ఈ నెల 23వ తేదీ నుంచి భారత్ నుంచి తమ దేశానికి విమానాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. నిజానికి యూఏఈ తీసుకున్న నిర్ణయం ప్రకారం విమాన సర్వీసులపై నిషేధం జులై 6వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది.

కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో షరతులతో కూడిన ప్రయాణానికి అనుమతి ఇచ్చింది. తమ దేశానికి చెందిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సంస్థ.. భారత్లోని అన్ని ప్రధాన నగరాల నుంచి విమానాలను నడిపించనున్నట్లు దుబాయ్ సుప్రీం కమిటీ ఆఫ్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభం కావడానికి ముందు నాటి పరిస్థితులకు అనుగుణంగా విమాన సర్వీసులు ఉంటాయని హామీ ఇచ్చింది ఎమిరేట్స్.
భారత్ ఒక్కటే కాకుండా దక్షిణాఫ్రికా, నైజీరియాలతోనూ వాయు సంబంధాలను పునరుద్ధరించుకోబోతోన్నట్లు తెలిపింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ఎమిరేట్స్ విమానయాన సంస్థ వెల్లడించింది. వ్యాలిడ్ రెసిడెన్స్ విసా ఉండి, యూఏఈ అప్రూవ్ చేసిన వ్యాక్సిన్ల రెండు డోసులను తీసుకున్న ప్రయాణికులకు తాము అనుమతి ఇస్తామని పేర్కొంది. అలాగే- ప్రయాణికులు 48 గంటలు ముందుగా తీసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ను అందజేయాల్సి ఉంటుందని తెలిపింది.