Ebola Virus: అమెరికాలోకి నో ఎంట్రీ! వంద మంది మృతి..
ఆఫ్రికా ఖండంలో ప్రాణాంతక 'ఎబోలా' వైరస్ అత్యంత వేగంగా విజృంభిస్తోంది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత ఊహించని స్థాయికి చేరింది. ఈ మహమ్మారి ధాటికి ఇప్పటికే కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 390 అనుమానిత కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితి విషమించడంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ ఎబోలా వ్యాప్తిని 'ప్రపంచ అత్యవసర ఆరోగ్య పరిస్థితి' (గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ)గా ప్రకటించింది.
ఈసారి వ్యాప్తికి 'బండిబుగ్యో' అనే ప్రమాదకర వైరస్ రకం కారణమని వైద్య నిపుణులు గుర్తించారు. ఇది శరీరంలో చేరితే తీవ్రమైన అంతర్గత రక్తస్రావానికి (వైరల్ హెమరేజిక్ ఫీవర్) దారితీస్తుంది. దీని మరణాల రేటు 25 నుండి 50 శాతం వరకు ఉండటం, దీనికి నిర్దిష్ట టీకా లేదా చికిత్స అందుబాటులో లేకపోవడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

ట్రంప్ నో ఎంట్రీ బోర్డ్..
ఎబోలా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రభావిత దేశాలైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ల నుండి వచ్చే విదేశీ ప్రయాణికులపై అమెరికా తాత్కాలిక ప్రవేశ నిషేధం విధించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. గత 21 రోజులలో ఈ మూడు దేశాలను సందర్శించిన విదేశీయులకు యూఎస్లోకి ప్రవేశం లేదు. ప్రస్తుతానికి 30 రోజుల పాటు అమలులో ఉండే ఈ ఆంక్షలు అమెరికా పౌరులకు, శాశ్వత నివాసితులకు వర్తించవని తాత్కాలిక CDC అధిపతి జే భట్టాచార్య స్పష్టం చేశారు. అమెరికాలోకి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా విమానాశ్రయాల్లో హెల్త్ స్క్రీనింగ్లను, కాంటాక్ట్ ట్రేసింగ్ను ముమ్మరం చేశారు.
అమెరికన్ వైద్యుడికి పాజిటివ్.. జర్మనీకి తరలింపు
ఆఫ్రికాలో సేవలందిస్తున్న ఆరుగురు అమెరికన్లకు కూడా ఈ వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రైస్తవ సహాయ సంస్థ 'సెర్జ్'కు చెందిన అమెరికన్ వైద్యుడు పీటర్ స్టాఫర్డ్కు ఎబోలా సోకినట్లు నిర్ధారణ కావడంతోనే అమెరికా ప్రభుత్వం ఈ కఠిన ఆంక్షల వైపు అడుగులు వేసింది. 2023 నుండి కాంగోలోని బునియాలో పనిచేస్తున్న ఆయనకు బండిబుగ్యో ఎబోలా వైరస్ పాజిటివ్గా తేలింది. ఆయనతో పాటు నయాన్కుడే ఆసుపత్రిలో పనిచేస్తూ రోగులతో సన్నిహితంగా ఉన్న స్టాఫర్డ్ భార్య, మరో ఇద్దరు వైద్యులను, నలుగురు పిల్లలను చికిత్స, అబ్జర్వేషన్ కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో జర్మనీకి తరలిస్తున్నారు. మిగిలిన వైద్యుల్లో ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
భారత్ హై అలర్ట్: ఎన్సీడీసీ నిఘా, ఎయిమ్స్ కీలక సూచనలు
అంతర్జాతీయంగా ఎబోలా విస్తరిస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. దేశంలోకి ఈ ప్రాణాంతక వైరస్ ప్రవేశించకుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (NCDC) అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ, నిఘాను తీవ్రం చేసింది.
ప్రస్తుతం భారతదేశంలో ఎబోలా ముప్పు చాలా తక్కువగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దిల్లీలోని ఎయిమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ స్పష్టం చేశారు. అయినప్పటికీ, గ్లోబల్ కనెక్టివిటీ మరియు అంతర్జాతీయ ప్రయాణాల కారణంగా అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున భారత్ ఎల్లప్పుడూ హై అలర్ట్లో ఉండాలని ఆయన సూచించారు.














Click it and Unblock the Notifications