బ్రిటన్ ఆర్థిక మంత్రిని తొలగించిన ప్రధాని లిజ్ ట్రస్: ‘పన్నుల కోత’ ఎఫెక్ట్
లండన్: బ్రిటన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పన్నుల కోత వ్యవహారం వివాదాస్పదమవుతున్న వేళ.. బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాసి క్వార్టెంగ్ పై ప్రధాని లిజ్ ట్రస్ వేటు వేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ వివాదాస్పదంగా మారిన నేపథ్యంలోనే ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.
ప్రధాని సూచనల మేరకు ఛాన్సలర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు క్వాసీ క్వార్టెంగ్ తెలిపారు. దీంతో ఆయన కేవలం 38 రోజులు మాత్రమే మంత్రి పదవిలో కొనసాగినట్లయింది. కాగా, పన్ను కోతలపై సెప్టెంబర్ నెలలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ వల్ల మార్కెట్లు కుదేలవుతున్నట్లు వార్తలు వచ్చాయి.
డాలర్ తో పోలిస్తే పౌండ్ రికార్డు కనిష్టానికి పడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ రంగంలోకి దిగి దిగ్గుబాటు చర్యలు ప్రారంభించింది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ మార్పులకు బ్రిటన్ ప్రభుత్వం ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం ప్రధాని లిజ్ ట్రస్ మీడియాతో మాట్లాడారు.
అంతకుముందే ఛాన్సలర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు క్వాసీ క్వార్టెంగ్ ప్రకటించారు. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆర్థిక మంత్రి క్వాసి క్వార్టెంగ్.. బ్రిటన్ ప్రధాని నుంచి ఆదేశాలు రావడంతో తిరిగివచ్చారు. ఆ తర్వాత తన పదవిని వదులుకున్నట్లు ప్రకటించారు.