కాల్పులు: తల్లిదండ్రులు, 6గురు చిన్నారుల మృతి
టెక్సాస్: అమెరికాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఆరుగురు పిల్లలతో సహా మొత్తం ఎనిమిదిమందిని ఓ వ్యక్తి దారుణంగా కాల్చి చంపాడు. ఈ ఘటన టెక్సాస్ రాష్ట్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.
డేవిడ్కూన్లే అనే 48 ఏళ్ల వ్యక్తి ఈ హత్యలకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. హౌస్టన్ నగరంలోని ఒక ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన కూన్లే.. ఇంట్లో ఉన్న వెలరీజాక్సన్ అనే మహిళను, ఆమె భర్త డానీజాక్సన్ను, ఆరుగురు పిల్లలను చేతులకు సంకెళ్లు వేసి బంధించాడు.
అనంతరం వారిందరినీ తుపాకితో కాల్చిచంపాడు. డేవిడ్కూన్లే, వెలరీజాక్సన్ గతంలో కొంతకాలంపాటు కలిసి జీవించారని.. హత్యకు గురైన ఆరుగురు పిల్లల్లో.. 13 ఏళ్ల బాలుడు వారి సంతానమేనని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు కూన్లేను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. కూన్లేకు మరణశిక్ష పడే అవకాశం ఉంది.