బ్రిటన్లో కరోనా డేంజర్ బెల్స్ : 8 మంది వైద్యులు మృతి.. ఒకరు భారత్..
కరోనాపై పోరులో ప్రపంచవ్యాప్తంగా వైద్యులే సైనికులుగా ముందుండి వైరస్ను ఎదుర్కొంటున్న పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు కొన్నిచోట్ల అవమానాలు,సౌకర్యాల లేమి వంటి వైద్యుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ ప్రాణాలను రిస్క్లో పెట్టి మరీ వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తున్నారు. ప్రాణాంతక వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు రేయింబవళ్లు ఆసుపత్రుల్లో యుద్దమే చేస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో వైద్యుల ప్రాధాన్యతను గుర్తించిన చాలా దేశాలు.. వారి రక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నాయి. అయినప్పటికీ వైరస్తో వార్లో వైద్యుల జీవితాలు హైరిస్క్లో ఉన్నాయనే చెప్పాలి. బ్రిటన్లో ఇప్పటివరకు 8 మంది వైద్యులు మృతి చెందారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బ్రిటన్లో విదేశీ వలస వైద్యులే ఎక్కువ
కరోనా మహమ్మారి బ్రిటన్లో 8 మంది వైద్యుల ప్రాణాలను బలితీసుకుంది. వీరంతా బ్రిటన్కు వలస వెళ్లిన వైద్యులే కావడం గమనార్హం. వీరిలో భారత్తో పాటు పాకిస్తాన్,ఈజిప్ట్,నైజీరియా,శ్రీలంక,సూడాన్ దేశాలకు చెందిన వైద్యులు కూడా ఉన్నారు. వైద్య రంగంలో ఆధిపత్యాన్ని కలిగివున్న బ్రిటన్లోనే ఇంతమంది వైద్యులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఒక అంచనా ప్రకారం బ్రిటన్లో మూడో వంతు వైద్యులు వలసదారులే. ఇందులో దాదాపు 43శాతం మంది సీనియర్ ఎన్హెచ్ఎస్(నేషనల్ హెల్త్ సర్వీస్) డాక్టర్లు కాగా.. మరో 47 శాతం మంది జూనియర్ ఫిజీషియన్స్. వేరే దేశాల నుంచి బ్రిటన్కు వలస వచ్చి ఇక్కడి ప్రజల కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వైద్యులకు తాము సెల్యూట్ చేస్తున్నామని యూకె హెల్త్ సెక్రటరీ మాట్ హన్కోక్ తెలిపారు.

మృతి చెందిన డాక్టర్ల వివరాలు
బ్రిటన్లో మృతి చెందిన వైద్యుల వివరాలను పరిశీలిస్తే.. సూడాన్కి చెందిన ఎల్-హవ్రాణి(55),ఆదిల్ ఎల్ టయర్(64),పాకిస్తాన్కి చెందిన జనరల్ ప్రాక్టిషనర్ హబీబ్ జైదీ(76) సయ్యద్ హైదర్(80),నైజీరియాకు చెందిన అల్ఫా సదు,భారత్కు చెందిన హార్ట్ సర్జన్ జితేంద్ర రాథోడ్(62) ఉన్నారు. అలాగే శ్రీలంకకు చెందిన ఆంటోన్ సెబాస్టియన్ పిల్లై(70),ఈజిప్టుకు చెందిన మహమ్మద్ సామి షాషా(79) ఉన్నారు.

సమాన గుర్తింపు ఇవ్వాలంటున్న నిపుణులు
రెండేళ్ల క్రితం బ్రిటన్ వైద్య రంగంలో పనిచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1500 దరఖాస్తులు వచ్చాయి. అయితే బ్రిటన్ ప్రభుత్వం వీటిని తిరస్కరించింది. యూరోపియన్ ఎకనమిక్ ఏరియా వెలుపలి నుంచి వచ్చేవారికి జారీ చేసే టైర్ 2 వీసాలపై పరిమితులు విధించడమే ఇందుకు కారణం. నిజానికి విదేశీ వలస వైద్యుల కారణంగా టాక్స్ రూపంలో అక్కడి ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. దాదాపు 270,000 డాలర్లు వైద్యుల నుంచి పన్నుల రూపంలో అందుతున్నాయి. అంతేకాదు,విదేశీ వైద్యులు తమ వార్షిక వీసా ఫీజుల కోసం వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. పైగా వారి పనిచేసే హెల్త్ సర్వీస్కు 500 డాలర్లు అదనంగా చెల్లించాలి. అయితే కరోనాపై పోరులో స్వదేశీ వైద్యులతో పాటు సమానంగా పనిచేస్తున్న విదేశీ వలస వైద్యులను కూడా సమానంగా గౌరవం,గుర్తింపుతో చూడాలని మెలానిన్ మెడిక్స్ వ్యవస్థాపకుడు ఒలామిద్ దాదా పేర్కొన్నారు.

కోలుకుంటున్న బ్రిటన్ ప్రధాని
కరోనా కేసుల విషయానికొస్తే బ్రిటన్లో ఇప్పటివరకు 60773 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,097 మంది మృత్యువాతపడ్డారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం వైరస్ బారినపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. స్టాండర్డ్ ఆక్సిజన్ ట్రీట్మెంట్ ద్వారా ఆయనకు నిరంతరం చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. బోరిస్ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications