మోదీ ప్రతిపాదనకు ఒప్పుకొన్న మస్క్- గేమ్ ఛేంజ్
Elon Musk: ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ అధినేత, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ చీఫ్ ఎలాన్ మస్క్.. భారత్లో అడుగుపెట్టబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం ఖాయంగా కనిపిస్తోంది. కీలక రంగాల్లో ఆయన భాగస్వామ్యాన్ని కేంద్రం కోరుకుంటోండటమే దీనికి ప్రధాన కారణం.
ఈ విషయంపై ఎలాన్ మస్క్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా మాట్లాడారు. అనేక అంశాలు ఆయనతో చర్చించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో భారత్- అమెరికా మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే విషయంపై ఈ ఇద్దరు నాయకులు మధ్య సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ సాగింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో ఎలాన్ మస్క్తో జరిగిన సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలపైనా చర్చించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. వివిధ సమస్యల గురించి మాట్లాడినట్లు పేర్కొన్నారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో భారత్ పురోగమించడానికి సహకరించాలని, అమెరికాతో ఉన్న సత్సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నామని వివరించారు.
ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా, స్టార్లింక్ సంస్థలు.. భారత్లో తమ సేవలను ప్రారంభించడానికి ప్రణాళికలను రూపొందించుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల మధ్య- ప్రధాని మోదీ స్వయంగా ఆయనకు ఫోన్ చేయడం, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో భాగస్వామ్యాన్ని కోరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
భారత్లో టెస్లా కార్ల తయారీ యూనిట్ను నెలకొల్పాలని భావిస్తోంది టెస్లా. ఈ విషయంపై అధికారులతో చర్చలు జరుపుతోంది. అలాగే- దేశంలో స్టార్లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను తీసుకురావడానికి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోతో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కుదరినట్లు ఈ ఏడాది మార్చిలో రిలయన్స్, భారతీ ఎయిర్టెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
It was an honor to speak with PM Modi.
— Elon Musk (@elonmusk) April 19, 2025
I am looking forward to visiting India later this year! https://t.co/TYUp6w5Gys
ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు రోజుల పాటు అమెరికాలో పర్యటించినప్పుడు ఎలాన్ మస్క్తో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్షం వంటి రంగాల్లో పెట్టుబడుల గురించి మాట్లాడారు. అప్పట్లోనే ఏకాభిప్రాయానికి వచ్చారు. మోదీ ఫోన్ కాల్తో ఆ కార్యాచరణ ప్రణాళిక మళ్లీ తెర మీదికి వచ్చింది.
కాగా- మోదీ చేసిన ట్వీట్కు ఎలాన్ మస్క్ కొద్దిసేపటి కిందటే రిప్లై ఇచ్చారు. ప్రధాని మోదీతో మాట్లాడిన విషయాన్ని నిర్ధారించారు. అలాగే- తన భారత పర్యటన గురించీ అధికారికంగా వెల్లడించారు. ప్రధాని మోదీతో మాట్లాడటం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఎలాన్ మస్క్ అన్నారు. ఈ ఏడాది చివర్లో భారత పర్యటనకు వస్తానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications