ఆపన్న హస్తం: వరదబాధితుల కోసం 175టన్నుల నిత్యావసరాలను మోసుకెళ్లనున్న ఎమిరేట్స్ విమానం
Recommended Video
కేరళ రాష్ట్రం వరదల ధాటికి తుడుచుపెట్టుకుపోయింది. గత వందేళ్లలో ఎన్నడూ చూడని భారీ విపత్తుకు కేరళ తల్లడిల్లింది. ఎంతో మంది కేరళను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే యూఏఈ రూ.700 కోట్లు సహాయం చేస్తామని ముందుకు వచ్చింది. అయితే కొన్ని నియమనిబంధనలతో భారత ప్రభుత్వం ఆ సహాయన్ని నిరాకరించింది. ఆ తర్వాత కేరళకు నగదు రూపంలో ఎంత సహాయం చేస్తామని చెప్పలేదంటూ యూఏఈ ప్రభుత్వం తెలిపింది. ఇంత గందరగోళ నడుమ... యూఏఈకి చెందిన ప్రముఖ విమానాయాన సంస్థ ఎమిరేట్స్ కేరళకు ఆపన్న హస్తం ఇస్తామంటూ ముందుకొచ్చింది. వరద బాధితులను ఆదుకునేందుకు 175 టన్నుల రిలీఫ్ మెటీరియల్ను కేరళకు తరలిస్తామంటూ ప్రకటించింది.
Emirates SkyCargo joins the UAE community in their support of the people of Kerala, India by transporting over 175 tons of flood relief cargo. #UAEsupportsKerala https://t.co/1w74tYCFNr pic.twitter.com/NgMsdrskRj
— Emirates Airline (@emirates) August 23, 2018
కేరళలో సంభవించిన వరదలకు అధికార లెక్కల ప్రకారం 231 మంది మృతి చెందారు. అనధికారికంగా ఆ సంఖ్య ఎక్కువే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దాదాపు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇది ఒక్క భారతదేశాన్నే కదిలించలేదు... దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా కేరళకు జరిగిన భారీ నష్టం విని తల్లడిల్లిపోయారు. పర్యాటక ప్రాంతమైన కేరళ ఒకప్పుడు ఎలా ఉండేదో వారి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విదేశాల నుంచి కేరళ అందాలను వీక్షించేందుకు వచ్చి ఆ మధురానుభూతులను తమవెంట తీసుకెళ్లిన చాలామంది విదేశీయులు కేరళను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. కేరళ తిరిగి పూర్వ వైభవం సంతరించుకునేందుకు తమ వంతు సాయం చేశారు.
ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంస్థ వరదబాధితుల కోసం నిత్యావసర వస్తువులను 12 విమానాల్లో తరలించనుంది. యూఏఈలో ఉన్న మళయాళీలతో సహా అక్కడి ప్రజలు కేరళ కోసం విరాళాలు ఇచ్చారు. వాటన్నిటినీ ఎమిరేట్స్ విమానాలు తీసుకుని తిరువనంతపురం విమానాశ్రయానికి బయలుదేరాయి. ఇందులో బోట్లు, దుప్పట్లు, పొడి ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ స్థానికంగా ఉన్న సహాయశిబిరాలకు చేరుస్తామని ఎమిరేట్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.