ఫేస్ బుక్ కార్యాలయంపై దాడి: నిరసన
లండన్: జర్మనీలోని ఫేస్ బుక్ కార్యాలయంపై దుండగులు మూకుమ్మడిగా దాడి చేసి రంగులు చల్లి నిరసన వ్యక్తం చేశారు. జాతిని రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తే సహించమని, మీ అంతు చూస్తామని ఫేస్ బుక్ నిర్వహకులను హెచ్చరించి వెళ్లారు.
ఫేస్ బుక్ నిర్వహకులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హాంబర్గ్ లోని ఫేస్ బుక్ కార్యాలయంలోకి ముసుగులు వేసుకున్న 20 మంది వెళ్లారు. తరువాత కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు ద్వంసం చేశారు.
అద్దాలు పగలగొట్టి రంగులు చల్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయం బయట ఫేస్ బుక్ డిజ్ లైక్ అని వ్రాసి వెళ్లారని జర్మన్ మీడియా వెల్లడించింది. దాడిచేసిన దుండగులు నల్లటి దస్తులు, ముసుగులు వేసుకున్నారని హాంబర్గ్ పోలీసులు చెప్పారు.
జాతి వివక్ష వ్యాఖ్యల వలన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని జర్మనీకి చెందిన నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ బుక్ లో పోస్టు చేసిన జాతిని రెచ్చగొట్టే ప్రసంగాలు తొలగించడంలో విఫలమయ్యారని ఫేస్ బుక్ యూరప్ విభాగం చీఫ్ జర్మనీలో విచారణ ఎదుర్కొంటున్నారు.
అయితే తాము జర్మనీ చట్టాలను ఉల్లంఘించలేదని, చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నామని ఫేస్ బుక్ ప్రతినిధులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హాంబర్గ్ లోని ఫేస్ బుక్ కార్యాలయం దగ్గర, పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.