అమెరికా ప్రభుత్వాన్నే హెచ్చరించిన ఫేస్ బుక్!!
ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ల మాతృసంస్థ మెటా అమెరికా ప్రభుత్వానికే హెచ్చరికలు జారీ చేసింది. ఒక చట్టానికి సంబంధించి ఈ హెచ్చరికలు చేసింది. ఇది కనుక అమల్లోకి వస్తే అక్కడి మీడియా సంస్థలు ఫేస్బుక్లో షేర్ చేసే కంటెంట్ ఫీజు విషయంలో బేరాలాడటానికి అవకాశం లభిస్తుంది. తాము వార్తా సంస్థలకు ట్రాఫిక్ పెంచేందుకు సహకరిస్తున్నామని, ఫేస్బుక్లో కంటెంట్ పోస్టు చేయడం వాటి ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని మెటా పేర్కొంది.
''జాతీయ భద్రతా చట్టంలో భాగంగా.. అసమగ్రంగా పరిశీలించిన జర్నలిజం బిల్లును కాంగ్రెస్ ఆమెదిస్తే గనుక.. మా వేదికపై నుంచి అమెరికాకు సంబంధించిన వార్తలను తొలగించే విషయాన్ని పరిశీలించాల్సి వస్తుంది'' అని మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ హెచ్చరించారు. ఆస్ట్రేలియా కూడా గతంలో ఇలాంటి చట్టాన్ని ప్రవేశపెట్టింది. అప్పట్లో ఆస్ట్రేలియా మీడియా సంస్థల వార్తలను ఫేస్బుక్ కొన్నాళ్లు సస్పెండ్ చేసింది.
తాజాగా ఈ తరహా చట్టాన్నే అమెరికాలో పరిశీలిస్తున్నారు. జేసీపీఏ (ది జర్నలిజం కాంపిటీషన్ అండ్ ప్రిజర్వేషన్ యాక్ట్) పేరిట మిన్నెసోటా సెనెటర్ యామీ క్లోబౌషెర్ కాంగ్రెస్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అన్ని విభాగాల నుంచి మద్దతు లభించింది. ఫీజు విషయంలో సోషల్ మీడియా సంస్థలను సమష్టిగా డిమాండ్ చేయడానికి వార్తా సంస్థలకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.
వాణిజ్య ప్రకటనల ఆదాయంలో వార్తాసంస్థలు భారీ వాటా కోరే అవకాశం ఉంది. ''ఏకఛత్రాధిపత్యం ప్రజాస్వామ్యాలకు ఎంత ప్రమాదకరమో.. అమెరికా కాంగ్రెస్ను బెదిరించేందుకు మెటా చేస్తున్న యత్నాలు తెలియజేస్తున్నాయి'' అని అమెరికన్ ఎకనామిక్ లిబర్టీస్ ప్రాజెక్టు పరిశోధకుడు మాట్ స్టోలర్ అభిప్రాయపడ్డారు.