రైతులకు పెరుగుతోన్న అంతర్జాతీయ మద్దతు.. ఆస్కార్ నటి సంఘీభావం,బ్రిటీష్ నటికి రేప్ బెదిరింపులు
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండుతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనకు అంతర్జాతీయ మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే పాప్ స్టార్ రిహన్నా,పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్,అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు మీనా హ్యారిస్,పోర్న్ స్టార్ మియా ఖలీఫా సహా తదితరులు రైతులకు మద్దతు ప్రకటించగా... తాజాగా బ్రిటీష్ నటి జమీల్ జమిల్ కూడా రైతుల ఉద్యమంపై ట్వీట్ చేశారు.
గత కొన్ని నెలలుగా భారత్లో రైతుల ఆందోళనల గురించి తాను మాట్లాడుతూనే ఉన్నానని... కానీ అలా మాట్లాడిన ప్రతీసారి తనకు అత్యాచార,హత్య బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు.
జమీలా జమీల్ ఏమన్నారంటే....
'గత కొన్ని నెలలుగా నేను తరచుగా భారతీయ రైతుల గురించి మాట్లాడుతూనే ఉన్నాను. అయితే నేను వాళ్లకు మద్దతుగా మాట్లాడిన ప్రతీసారి చంపేస్తామని, అత్యాచారం చేస్తామని నాకు బెదిరింపులు వస్తున్నాయి. నాపై ఇటువంటి బెదిరింపులకు పాల్పడేవారు ఓ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. నేనూ మనిషినేనని, నా సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. భారతీయ రైతులకు నా సంఘీభావం ఉంటుంది... ఈ ఆందోళనల్లో తమ హక్కుల కోసం పోరాడే ప్రతీ ఒక్కరికీ నా సంఘీభావం ఉంటుంది.' అని జమీలా జమీల్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
రైతులకు ఆస్కార్ నటి మద్దతు...
జమీలా జమీల్ ట్వీట్పై మరో నటి ఆండీయ మెక్డోవల్ స్పందించారు.' గతేడాది కరోనా వైరస్ వ్యాప్తికి ముందు భారత్ వెళ్లాను... నేనూ అంతా గమనిస్తూనే ఉన్నాను... నిన్నెందుకు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు.. వాళ్లను నువ్వు బ్లాక్ లిస్టులో పెట్టు..' అని పేర్కొన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత,నటి సుసాన్ సరందన్ కూడా శనివారం(ఫిబ్రవరి 6) రైతులకు మద్దతుగా ట్వీట్ చేశారు. 'భారత్లో ఆందోళనలు చేస్తున్న రైతులకు నా సంఘీభావం ప్రకటిస్తున్నాను.' అని తెలిపారు. అంతేకాదు,న్యూయార్క్ టైమ్స్ 'భారత్లో రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు..' అనే శీర్షికన ప్రచురించిన ఆర్టికల్ను ట్విట్టర్లో షేర్ చేశారు. వాళ్లెవరో... ఎందుకు ఆందోళన చేస్తున్నారో చదవండి అని పేర్కొన్నారు.
మున్ముందు ఏ మలుపు తీసుకుంటుందో...?
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు రైతుల ఆందోళనలకు మద్దతు పెరుగుతోంది. మరోవైపు కొంతమంది దేశీ సెలబ్రిటీలు మాత్రం ఇది దేశ అంతర్గత విషమని బయటి వ్యక్తుల జోక్యం అనవసరమని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ అభిప్రాయంపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మొత్తంగా రైతు ఉద్యమంపై భారత్లో సోషల్ మీడియా అనుకూల,వ్యతిరేక వర్గాలుగా చీలిపోయింది. రైతులకు అంతర్జాతీయ సెలబ్రిటీల మద్దతును వారి అనుకూల వర్గం స్వాగతిస్తుండగా... వ్యతిరేక వర్గం తప్పు పడుతోంది.శుక్రవారం(ఫిబ్రవరి 5) ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం కూడా రైతుల ఆందోళనలపై స్పందించింది. శాంతియుత నిరసనను వ్యక్తం చేసే ప్రజల హక్కును కాపాడాల్సిందేనని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో మున్ముందు ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది.