ట్రంప్కు మరో ఎదురుదెబ్బ: ట్రావెల్ బ్యాన్పై కోర్టు ఇలా
వాషింగ్టన్: అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి న్యాయస్థానంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి ప్రభుత్వం అమెరికాలో ప్రవేశించకుండా ఆరు ముస్లిం దేశాల పౌరులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
కాగా, దీనిపై తొలుత సుప్రీంకోర్టు.. అమెరికాలో నివసిస్తున్న ఆయాదేశాల వ్యక్తుల సమీప బంధువులకు ప్రవేశం కల్పిస్తూ ఆంక్షలను పాక్షికంగా సడలించింది.
దీంతో ప్రభుత్వం 'సమీప బంధువులు' అన్న మాటకు నిర్వచనం ఇస్తూ ఆ జాబితాలో తాతలు, అమ్మమ్మ/నాన్మమ్మలను మినహాయించింది.

కాగా, హవాయి రాష్ట్రప్రభుత్వం హోనోలూలూలోని కోర్టును ఆశ్రయించగా వీరు కూడా సమీప బంధువుల కిందకే వస్తారని పేర్కొంది. కనీస జ్ఞానం ప్రకారం తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు, అత్తలు, మామలు, పెదనాన్నలు, పెద్దమ్మలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు.. బావలు, వదినలు, మరదులు, మరదళ్లు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు, అన్నదమ్ముల పిల్లలు, సోదరులను ఈ జాబితాలో చేరతారని తెలిపింది. కాగా, ట్రంప్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు వచ్చే అక్టోబరులో తుది విచారణ జరుపనుంది.












Click it and Unblock the Notifications