అమెరికా ఆదిమజాతి తెగకు చెందిన మహిళకు జో కేబినెట్లో కీలక పోర్ట్ఫోలియో: జనాభా 1200 లోపే
వాషింగ్టన్: లగునా ప్యూబ్లో. అమెరికా ఆదిమ జాతి తెగకు చెందిన సామాజిక వర్గం ఇది. దాదాపు అంతరించి పోయే దశలో ఉంది. 2018 జనాభా గణాంకాల ప్రకారం.. ఈ సామాజిక వర్గానికి చెందిన వారు 1,151 మంది మాత్రమే. అందులోనూ మెజారిటీ ప్రజలు న్యూ మెక్సికోలో నివసిస్తున్నారు. స్థానికంగా వారిని గిరిజనులుగా గుర్తింపు ఉంది. ఫస్ట్ నేటివ్ అమెరికన్లుగా భావిస్తారు. అలాంటి ప్రాచీన సామాజిక వర్గానికి చెందిన మహిళకు కొత్త అధ్యక్షుడు జో బిడెన్ మంత్రివర్గంలో చోటు దక్కింది. యూఎస్ కాంగ్రెస్కు ఎన్నికైన డెబ్ హాలెండ్కు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పదవిని అప్పగించారు.
కైలాసానికి విమానాలు: ఎక్కడి నుంచో తెలుసా?: త్రీ డేస్ ఫుల్..అన్నీ ఫ్రీ: రాసలీలల నిత్యానంద
తొలిసారిగా యూఎస్ కాంగ్రెస్కు..
కిందటి నెల నిర్వహించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెబ్ హాలెండ్.. న్యూ మెక్సికో నుంచి డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఘన విజయాన్ని అందుకున్నారు. ఆమె యూఎస్ కాంగ్రెస్కు ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఇదివరకు కూడా లగునా ప్యూబ్లో సామాజిక వర్గానికి చెందిన వారెవరూ ఆ దేశ పార్లమెంట్లో అడుగు పెట్టలేదు. తాజాగా ఆమెకు కేబినెట్లో చోటు కల్పించారు. న్యూ మెక్సికోలోని అల్బుర్కెక్యూ డిస్ట్రిక్ట్ నుంచి విజయం సాధించారు. న్యూమెక్సికోలో నివసించే స్థానిక ఆదిమ జాతి తెగలకు చెందిన వారిని నేటివ్ అమెరికన్లుగా పిలుస్తారు. ఈ తెగకు చెందిన వారికి క్యాబినెట్లో స్థానం దక్కడం ఇదే తొలిసారి.
గిరిజన హక్కుల కోసం
అరిజోనాలో జన్మించిన ఆమె అనంతరం అల్బుర్కెక్యూలో స్థిరపడ్డారు. తన సామాజిక వర్గానికి చెందిన వారి అభ్యున్నతి కోసం కృషి చేశారు. వారి హక్కుల కోసం ఉద్యమించారు. గిరిజనులకు చెందిన మైదాన ప్రాంత భూముల ఆక్రమణను నిరోధించడానికి పోరాడారు. అలాంటి ఉద్యమాలే ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. డెమొక్రటిక్ పార్టీ ఆమెకు న్యూ మెక్సికో నుంచి ఎన్నికల బరిలో దింపింది. ఈ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. యూఎస్ కాంగ్రెస్లో అడుగు పెట్టడాన్ని గొప్పగా భావిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమైన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖను కేటాయించారు.
గిరిజనులకు ప్రాతినిథ్యాన్ని కల్పించడం పట్ల..
జో బిడెన్- కమలా హ్యారిస్ టీమ్లో తాను సభ్యురాలు కావడం ఆనందంగా ఉందని డెబ్ హాలెండ్ వ్యాఖ్యానించారు. ఇది తన సామాజిక వర్గం మొత్తానికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ట్రంప్ ప్రభుత్వ హయాంలో గిరిజనుల గోడును ఎవరూ పట్టించుకోలేదని..ఇక వారి వెతలను తీర్చే బాధ్యత తనకే దక్కిందని చెప్పారు. బిడెన్ ప్రభుత్వం ప్రాచీన గిరిజన తెగల సంక్షేమానికి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. గిరిజన భూములు, పర్యావరణం, నేషనల్ పార్కులు.. వంటివి ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నాయి.