లండన్లో భారత జాతీయజెండాకు అవమానం: జెండాను తగులబెట్టిన ఖలిస్తాన్ మద్దతుదారులు
లండన్లో భారత త్రివర్ణ పతాకానికి అవమానం జరిగింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత హైకమిషన్ కార్యాలయం బయట ఖలిస్తాన్ మద్దతుదారులు భారత జాతీయ జెండాను కాల్చారు. పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఇలా జరగడం ఇది రెండో సారి. దీనిపై భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వానికి లేఖ రాసింది.
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా లండన్లో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందని అక్కడి భద్రతా అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా... వాటిని అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఘాటు లేఖ భారత ప్రభుత్వం అక్కడి అధికారులకు రాసింది. అయితే జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి. ఒక్క గణతంత్రదినోత్సవం రోజునే కాదు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడకూడదని ఆయన అన్నారు.

లండన్లోని ఇండియా హౌజ్ బయట జాతీయ జెండాను తగులబెడుతున్న దృశ్యాలు, ఫోటోలు, పతాకాన్ని కాలుతో నలుపుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. నిరసనకారులు ఖలిస్తాన్కు మద్దతుగా నినాదాలు చేస్తున్నట్లు వీడియోలో వినిపించింది. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ భద్రతాధికారి అజిత్ దోవల్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం అదికూడా కొందరు బ్రిటన్ పోలీసులు అధికారుల ముందే ఇదంతా జరగడంపై భారత ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2018లో లండన్ పర్యటనకు ప్రధాని మోడీ వెళ్లిన సందర్భంలో కూడా నిరసనకారులు తమ నిరసనను తెలిపారు.
భారత ప్రభుత్వానికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూనే భారత్తో బ్రిటన్ సత్సంబంధాలు కోరుకుంటోందని వెల్లడించారు బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి. అంతేకాదు యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చి ఇతర దేశాలతో కొత్తగా సంబంధాలు పెంపొందించుకోవడానికి కృషి చేస్తున్నామని బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి చెప్పారు.












Click it and Unblock the Notifications