సరిహద్దులో యుద్ధమేఘాలు: ఆందోళనగా ఉందన్న ఐరాస
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి భారత సైన్యం చొచ్చుకుపోయి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడంపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. యూరీ ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని, ఈ విషయంలో తీవ్ర ఆందోళనగా ఉందని ఐరాస సెక్రటరీ జనరల్ డ్యుజారిక్ అన్నారు.
సరిహద్దుల్లోని ఉద్రిక్తత పరిస్థితులను ఐక్యరాజసమితి మిలటరీ విభాగం నిశితంగా గమనిస్తోంది. పీఓకేలో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ దాడులు నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్కీమూన్ దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.
భారత్, పాక్ మధ్య జరుగుతున్న కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలను ఐరాస పరిశీలిస్తూనే ఉందని, ఇరు దేశాలు కూడా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ సమస్య ఉంటే శాంతియుత వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
ఇరు దేశాలు వెంటనే ఒక అవగాహనకు రావాలని ఆయన కోరారు. సరిహద్దుల్లో పరిస్థితిని యథాస్థితికి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. పీఓకేలోకి భారత్ సైన్యం చొచ్చుకుపోయి సర్జికల్ దాడులు నిర్వహించడం వల్ల పాకిస్థాన్కు చెందిన 38 మంది ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే.
కాగా, 1949 జనవరి 24న యూఎన్ఎంవోజీఐపీ ఏర్పడింది. ప్రస్తుతం దీనిలో స్వీడన్కు చెందిన మేజర్ జనరల్ పెర్ గుస్తాఫ్ లోదిన్ ఆధ్వర్యంలో 10 దేశాలకు చెందిన 41 మంది అబ్జర్వర్లు ఉన్నారు. యూరీ ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడం సహజమేనని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ స్పందించారు.
భారత సైన్యం నిర్వహించిన మెరుపుదాడులు గురించి చూశామని, పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. భారత్, పాక్ సైన్యాలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారని భావిస్తున్నామని, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించాలంటే ఇరుదేశాల మధ్య కమ్యూనికేషన్ ఉండటం చాలా ముఖ్యమని అన్నారు.
ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని, అందువల్ల లష్కరే తాయిబా జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద గ్రూపులను అణిచేయాలని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు జాన్ కిర్బీ చెప్పారు. ఈనెల 27వ తేదీన భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్తో మాట్లాడిన ఆయన యూరీ ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు.