భారత్ కు బిగ్ షాక్..! మరో దేశం 50 శాతం సుంకాల మోత..! కేంద్రం ఫైర్..!
అమెరికా తరహాలోనే మెక్సికో కూడా భారత్ పై 50 శాతం సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు భారత్ కు సంకటంగా పరిణమిస్తున్నాయి. ఈ ఏడాది భారతీయ ఉత్పత్తులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. ఇందులో 25 శాతం సుంకాలు సాధారణమైనవి కాగా.. మరో 25 శాతం రష్యా చమురు కొనుగోలు చేస్తున్నామన్న కోపంతో ట్రంప్ విధించినవి ఉన్నాయి. ఇప్పుడు ఇదే బాటలో అమెరికా పొరుగుదేశం కూడా భారత్ పై ఇలాగే 50 శాతం సుంకాలు విధించి షాక్ ఇచ్చింది.
కొన్ని భారతీయ ఉత్పత్తులపై సుంకాల్ని 50 శాతానికి పెంచుతూ మెక్సికో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటో విడిభాగాలు, తేలికపాటి కార్లు, దుస్తులు, ప్లాస్టిక్, ఉక్కు, గృహోపకరణాలు, బొమ్మలు, వస్త్రాలు, ఫర్నిచర్, పాదరక్షలు, తోలు వస్తువులు, కాగితం, కార్డ్బోర్డ్, మోటార్సైకిళ్లు, అల్యూమినియం, ట్రైలర్లు, గాజు, సబ్బులు, సుగంధ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలు వంటి వస్తువులపై మెక్సికో సుంకాలు విధించింది.

స్థానిక పరిశ్రమ, ఉత్పత్తిదారులను రక్షించడానికి మెక్సికో విధించిన ఈ సుంకాలు 2026 జనవరి 1 నుండి అమలులోకి వస్తాయి. ఈ నిర్ణయం దాదాపు 1 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు కొత్త సుంకాల ప్రభావం భారతదేశంతో పాటు, దక్షిణ కొరియా, చైనా, థాయ్లాండ్, ఇండోనేషియా వంటి మెక్సికోతో వాణిజ్య ఒప్పందాలు లేని దేశాలపై పడనుంది. ఈ సుంకాల నుంచి భారతీయ కంపెనీలను రక్షించడానికి భారత్, మెక్సికో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మెక్సికో తాజా నిర్ణయంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భారతీయ ఎగుమతిదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి తగిన చర్యలు తీసుకునే హక్కు భారతదేశానికి ఉందని, నిర్మాణాత్మక చర్చల ద్వారా పరిష్కారం కోసం కృషి చేస్తామని వాణిజ్య వ్యవహారాలశాఖ తెలిపింది. ఈ బిల్లును మొదట ప్రవేశపెట్టిన సమయంలోనే మెక్సికోతో భారత్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయినా మెక్సికో వెనక్కి తగ్గలేదు.

ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలను అన్వేషించడానికి భారత వాణిజ్య శాఖ.. మెక్సికో ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది. ఈ విషయంపై ఇప్పటికే వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్, మెక్సికో ఉప-ఆర్థిక మంత్రి లూయిస్ రోసెండో మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. త్వరలో మరిన్ని చర్చలు ఉంటాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications