డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో పెను విషాదం: అనుమానాస్పద స్థితిలో భార్య కన్నుమూత: కేసు నమోదు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ఆమె వయస్సు 73 సంవత్సరాలు. ఆమెకు ముగ్గురు పిల్లలు డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్ ఉన్నారు. ఇవానా మరణానికి గల కారణం తెలియరాలేదు. మెట్ల మీది నుంచి జారీ కింద పడటం వల్ల మరణించారని, దీనిపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారని ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
న్యూయార్క్ మన్హట్టన్లోని నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవానా మరణించిన విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా తెలియజేశారు. ఏ కారణంతో కన్నుమూశారనే విషయాన్ని అందులో పొందుపరచలేదు. ఆమెతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ అద్భుతమైన, శక్తిమంతమైన మహిళగా పేర్కొన్నారు.
ఇవానా.. డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య. ఆమె స్వదేశం చెక్ రిపబ్లిక్. 1970ల్లో మోడల్గా రాణించారు 1976లో తొలిసారిగా న్యూయార్క్లో ట్రంప్ను కలుసుకొన్నారు. ఆ మరుసటి సంవత్సరమే పెళ్లి చేసుకున్నారు. అనంతరం పారిశ్రామికవేత్తగా ఎదిగారు. డొనాల్డ్ ట్రంప్-ఇవానా దంపతులకు ముగ్గురు పిల్లలు. డొనాల్డ్ ట్రంప్తో విడిపోయిన తరువాత మన్హట్టన్ ఈస్ట్ 64 స్ట్రీట్లోని విశాలమైన బంగళాలో నివసిస్తోన్నారు.
అమెరికా కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి 12:40 నిమిషాలకు స్టెయిర్ కేస్ కింద ఆమె నిర్జీవంగా పడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే డాక్టర్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాక్టర్లు మృతి చెందినట్లుగా ధృవీకరించారు. మెట్ల మీది నుంచి జారిపడిన తరువాత గుండెపోటు సంభవించి ఉండొచ్చని మెడికల్ ఎగ్జామినర్ పేర్కొన్నారు. ఇవానాను ఎవరైనా తోసి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని న్యూయార్క్ సిటీ పోలీసులు తెలిపారు.
N
అనుమానితులు గానీ, కొత్త వ్యక్తులు గానీ ఇంట్లోకి జొరబడిన ఆనవాళ్లు లేవని చెప్పారు. కొద్దిరోజులుగా ఆమె తరచూ అనారోగ్యానికి గురవుతూ వస్తోన్నారని సిబ్బంది పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ట్రంప్కు ఫోన్ చేసి, సంతాపం తెలుపుతున్నారు.