భారత్-పాక్ అణుయుద్ధం అలా అడ్డుకున్నా-తాజా పుస్తకంలో ట్రంప్ కేబినెట్ మంత్రి సంచలనం..
2019లో కశ్మీర్లోని పుల్వామాలో తీవ్రవాద ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో భారత జవాన్లు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత భారత్ తీవ్రంగా స్పందించి పాకిస్తాన్ లోని బాలా కోట్ పై రహస్య ఆపరేషన్ చేసింది. అదే సమయంలో భారత్-పాక్ రెండు దేశాలు పరస్పర అణు బాంబుల ప్రయోగానికి సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. అమెరికా జోక్యం కారణంగా ఈ రెండు దేశాలు అణుయుద్ధ ఆలోచనను విరమించుకున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన మైంక్ పాంపియో తన తాజా పుస్తకంలో వెల్లడించారు.
2019లో పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత పరస్పర అణ్వాయుధాలను ప్రయోగించేందుకు భారత్, పాకిస్థాన్ సిద్ధమవుతున్నట్లు ఇరుదేశాల అధికారులు విశ్వసించారని అమెరికా మాజీ మంత్రి మైక్ పాంపియా వెల్లడించారు. అయితే అణు యుద్ధానికి సిద్ధపడడం లేదని ఇరుదేశాల్నీ అమెరికా ఒప్పించాల్సి వచ్చిందని పాంపియో తన తాజా పుస్తకం "నెవర్ గివ్ యాన్ ఇంచ్"ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్'లో రాశారు.
2019 ఫిబ్రవరిలో వియత్నాం పర్యటన సందర్భంగా అప్పటి భారత విదేశాంగమంత్రితో మాట్లాడేందుకు రాత్రి నిద్ర లేచినప్పుడు పరిస్థితి తీవ్రత గురించి తెలుసుకున్నానని పోంపియో ఇందులో రాశారు. అప్పటి యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్, కెన్నెత్ జస్టర్, అప్పటి భారతదేశంలోని యుఎస్ రాయబారి, ఇతర సీనియర్ అధికారులతో కలిసి ఉద్రిక్తతలను తగ్గించడానికి జరిగిన ప్రయత్నాలకు తాను నాయకత్వం వహించినట్లు వెల్లడించారు. అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో తన పుస్తకంలో పాకిస్థానీలు తమ అణ్వాయుధాలను దాడులకు సిద్ధం చేసుకోవడం ప్రారంభించారని, అదే సమయంలో తాము అంతకు మించిన దాడికి సిద్ధం కావడంపై భారత్ కూడా ఆలోచించిందని పేర్కొన్నారు.
అయితే అప్పట్లో భారత్-పాకిస్తాన్ ఇరుదేశాలు అణుదాడికి ఎంత దగ్గరగా వచ్చాయనేది ప్రపంచానికి తెలియదని, అలాగే తాము కూడా ఇది ఊహించలేదని మైక్ పాంపియో తన పుస్తకంలో తెలిపారు. దీంతో అప్పటి అణుదాడిని అడ్డుకునేందుకు తాము తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి వచ్చిందన్నారు. చివరికి ఎలాగోలా అణుదాడి ప్రయత్నాలు ఆపినట్లు పాంపియో చెప్పుకున్నారు.