అప్పుడు క్యాన్సర్, ఇప్పుడు కరోనా- దుబాయ్ లో నాలుగేళ్ల భారతీయ చిన్నారి అద్భుతం..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కుదిపేస్తున్న దేశాల్లో గల్ఫ్ లోని దుబాయ్ కూడా ఉంది. ఇక్కడ భారత్ నుంచి ఎప్పుడో వలస వెళ్లిన ఓ కుటుంబం ఉంది. అందులో నాలుగేళ్ల చిన్నారి. ఆమె తల్లి ఓ హెల్త్ వర్కర్. తాజాగా ఆమెకు కరోనా సోకింది. ఆమె నుంచి కూతురు శివానీకి కూడా వైరస్ వ్యాపించింది. వైద్యులు ఐసీయూలో ఉంచి ఆమెకు చికిత్స అందించారు. చాలా బలహీనంగా ఉన్నప్పటికీ ఆమెకు చికిత్స కొనసాగించారు. చివరికి ఆమె కోలుకుంది. అసలే పదేళ్ల వయసులో కరోనా సోకితే కష్టమని ప్రపంచమంతా భావిస్తున్న వేళ చిన్నారి శివానీ కోలుకోవడం దుబాయ్ లో ఇప్పుడో సంచలనం.
ఇదే ఓ అద్భతమని అనుకుంటే అంతకు మించిన అద్భుతాన్ని ఈ చికిత్స సందర్భంగా వైద్యులు గుర్తించారు. ఏడాది క్రితం ఇదే శివానీకి కిడ్నీ క్యాన్సర్ సోకింది. అప్పట్లో ఆమెను కీమోథెరపీ అందించడం ద్వారా అతి కష్టం మీద వైద్యులు బతికించారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత ఆమెను ఇంట్లో తల్లితండ్రులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అయితే హెల్త్ వర్కర్ గా పనిచేస్తున్న శివానీ తల్లికి తాజాగా విధి నిర్వహణలో ఉండగానే కరోనా వైరస్ సోకింది. దాన్ని ఆమె గమనించలేదు. చివరికి కుమార్తెతో పాటు భర్తకు కూడా సోకింది. చివరికి వైద్యులు ఎంతో శ్రమించి శివానీని గట్టెక్కించారు.
గతంలో క్యాన్సర్ తో పోరాడి గెలిచిన శివానీ ఇప్పుడు కరోనాను కూడా జయించడం వైద్య రంగంలోనే ఓ అద్భుతంగా గల్ఫ్ న్యూస్ రిపోర్ట్ చేసింది. శివానీ ఇప్పుడు క్యాన్సర్, కరోనాను గెలిచిన విజేత మాత్రమే కాదు కరోనాతో పోరాడి గెలిచిన అత్యంత పిన్నవయస్కురాలిగానూ రికార్డు సృష్టించింది. ఏప్రిల్ 1న కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఆమె 20వ తేదీన డిశ్చార్జ్ అయింది. అయితే ముందు జాగ్రత్తగా ఆమెను హోమ్ క్వారంటైన్లో ఉంచారు.