కరోనా వైరస్ బారిన పడ్డ ఫ్రాన్స్ అధ్యక్షుడు: ఎలైసీ ప్యాలెస్ ఏం చెబుతోందంటే?
ప్యారిస్: మరో దేశాధినేత కరోనా వైరస్ బారిన పడ్డారు. భారత్ సహా అనేక దేశాలకు చెందిన ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు, మంత్రులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వంటి ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు. మొన్నటికి మొన్న ఆఫ్రికన్ దేశం ఎస్వాతిని (స్వాజీలాండ్) ప్రధానమంత్రి అంబ్రోస్ ద్లామిని ఈ మహమ్మారి బారిన పడి కన్నుమూశారు. సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల ఆయన మరణాంచారు.
అమరావతి జనభేరీ: బీజేపీ..జనసేన దూరం?: కారణం?: ఉద్యమంలో చంద్రబాబు సహా
తాజాగా- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మెక్రాన్ కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. వైరస్ సోకినట్లు తేలడంతో ఆయన హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్ష నివాసం ఎలైసీ ప్యాలెస్ నిర్ధారించింది. ఇమ్మానుయెల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయని వెల్లడించింది. వైరస్ లక్షణాలు ప్రాథమిక దశలో ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను జారీ చేసింది. ఫ్రాన్స్ ప్రధానమంత్రి జీన్ కాస్టెక్స్ కూడా దీన్ని ధృవీకరించారు.
ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసొలేషన్లో ఉంటున్నారని చెప్పారు. ఏడురోజుల పాటు ఆయన ఐసొలేషన్లో గడపాలని డాక్టర్లు సలహా ఇచ్చారని అన్నారు. ఆయన ఆరోగ్యం బాగుందని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని పేర్కొన్నారు. ప్రాథమిక లక్షణాలే కావడం వల్ల ఏడు రోజుల పాటు ఐసొలేషన్లో ఉండాల్సి వచ్చిందని జీన్ కాస్టెక్స్ వివరించారు. సెల్ఫ్ ఐసొలేషన్ నుంచే మెక్రాన్ తన విధులను నిర్వరిస్తున్నారని, దీనికి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారని ఎలైసీ ప్యాలెస్ పేర్కొంది.
రోజువారీ సమీక్షలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారని తెలిపింది. తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ ఆయన రద్దు చేసుకున్నారని స్పష్టం చేసింది. ఈ వారంలో ఆయన లెబనాన్ను పర్యటించాల్సి ఉందని, అది రద్దయినట్లు సర్కులర్ను పంపించింది. ప్రస్తుతం ఫ్రాన్స్లో 24,09,062 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి 59,361 మంది మరణించారు. 1,80,311 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 21,69,390గా నమోదు అయ్యాయి.