గ్యాంగ్ రేప్ కేసులో పాకిస్థాన్ డిప్యూటీ పీఎం బంధువు.. బాధితురాలి షాకింగ్ స్టేట్మెంట్ !!
పాకిస్తాన్లో ఇద్దరు విదేశీ మహిళల కిడ్నాప్, గ్యాంగ్రేప్ ఆరోపణల కేసు రాజకీయంగా, దర్యాప్తు పరంగా మరింత సున్నితంగా మారింది. ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్కు బంధువుగా చెబుతున్న రజా దార్ పేరు ప్రధాన నిందితుడిగా రావడంతో పాటు, ఈ కేసు వెనుక భారీ క్రిప్టోకరెన్సీ లావాదేవీల వివాదం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
లాహోర్లో నమోదైన ఈ కేసులో బాధితుల్లో ఒకరైన ఆస్ట్రిడ్ గాబ్రియేలా రాబిన్సన్ బ్రాచో న్యాయ మేజిస్ట్రేట్ ముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. తాను, తన స్నేహితురాలు స్టెఫానీ అడ్రియానా లాహోర్కు వచ్చిన తర్వాత తాము ఉన్న ఇంట్లోకి ఆయుధాలతో వచ్చిన వ్యక్తులు చొరబడ్డారని ఆమె ఆరోపించారు.

క్రిప్టో డబ్బుల కోసమే దాడి జరిగిందా?
ఆస్ట్రిడ్ వాంగ్మూలం ప్రకారం, దాడి చేసినవారు వారిని కట్టేసి గదిలో నిర్బంధించారు. రజా దార్ కంప్యూటర్, క్రిప్టోకరెన్సీ ఫండ్స్కు సంబంధించిన వివరాలు, పాస్వర్డ్లు అడిగాడని ఆమె పేర్కొన్నారు. “డబ్బు ఉన్న కంప్యూటర్ ఎక్కడ ఉందని అడిగారు. అది ఆకుపచ్చ బ్యాగ్లో ఉందని చెప్పాను” అని ఆమె మేజిస్ట్రేట్కు తెలిపినట్టు స్థానిక మీడియా నివేదించింది.
దర్యాప్తు వర్గాల ప్రకారం, రజా దార్ మరియు ఇద్దరు మహిళల మధ్య సుమారు 15 లక్షల డాలర్ల విలువైన క్రిప్టో లావాదేవీలకు సంబంధించిన వివాదం ఉన్నదా అనే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. వారిని పాకిస్తాన్కు తప్పుడు కారణాలతో రప్పించి, తర్వాత కిడ్నాప్ నాటకం వేసినట్టుగా చేశారా అన్న కోణం కూడా దర్యాప్తులో ఉంది.
కోర్టు రిమాండ్, బాధితుల స్థితిపై ప్రశ్నలు
ఈ కేసులో రజా దార్, హసన్ రజా, సికందర్ ఖాన్, సాజిద్ అలీ అనే నలుగురిని లాహోర్ కోర్టు ఐదు రోజుల పోలీసు రిమాండ్కు ఇచ్చింది. ఆయుధాలు, నేరానికి సంబంధించిన డబ్బు ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితులను జూలై 8న మళ్లీ కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.
ఆస్ట్రిడ్ తన వాంగ్మూలంలో లైంగిక దాడి ఆరోపణలూ చేశారు. ముగ్గురు వ్యక్తులు గదిలోకి వచ్చారని, వారిలో ఇద్దరు తనపై దాడి చేశారని, మరో వ్యక్తి రైఫిల్తో కాపలా నిలిచాడని ఆమె పేర్కొన్నారు. చివరికి వాహనం ప్రమాదానికి గురైనప్పుడు తాము బయటకు దూకి సహాయం కోసం అరిచామని, స్థానికులు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారని చెప్పారు.
బాధితుల వాంగ్మూలాలు సీల్ చేసి మేజిస్ట్రేట్ కస్టడీలో ఉంచినట్టు సమాచారం. ఇద్దరు మహిళలు పాకిస్తాన్ విడిచి వెళ్లి ఉండొచ్చన్న వార్తలూ వస్తున్నాయి. అధికారులు మాత్రం విచారణ కొనసాగుతోందని, క్రిప్టో వివాదం, కిడ్నాప్ ఆరోపణలు, లైంగిక దాడి అంశాలపై తుది నిర్ధారణకు ఇంకా రాలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications