12 ఏళ్ల బాలిక ఆత్మాహుతి దాడి: పది మంది మృతి
నైజీరియా: నైజీరియాలో ఒక బాలిక తనను తాను పేల్చేసుకుని 10 మంది సామాన్యులను పొట్టన పెట్టుకుంది. అతి చిన్న వయస్సులో సూసైడ్ బాంబర్ గా తయారైయ్యింది. రద్దీగా ఉన్న మార్కెట్ దగ్గరకు వెళ్లిన బాలిక రిమోట్ తో తనకు అమర్చిన బాంబులు పేల్చింది.
ఈశాన్య నైజీరియా గుజ్బ జిల్లాలోని వజిర్ నగరంలోని ఒక మార్కెట్ లోకి 12 సంవత్సరాల బాలిక వెళ్లింది. తరువాత కొంత సేపు అటు ఇటు సంచరించింది. వారంలో ఒక రోజు జరిగే సంత కావడంతో మార్కెట్ పూర్తిగా జనంతో నిండిపోయింది.
ఆ సమయంలో జనం మధ్యలోకి వెళ్లిన బాలిక తనను తాను పేల్చేసుకుంది. బాంబు దాడిలో 10 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. 20 మందికి పైగా గాయాలై ఆర్తనాదాలు చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, ఆర్మీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. బాలికను గతంలో తాము ఎప్పుడూ చూడలేదని ప్రత్యక్ష సాక్షులు, వ్యాపారులు పోలీసులకు చెప్పారు.
గాయపడిన వారిలో చాల మంది పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారులు చెప్పారు. గత సోమవారం బోర్నోలో 17 ఏళ్ల బాలిక బస్టాండ్ లో ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 19 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు.
జనసంద్రమైన ప్రాంతాలలో ఉన్న ప్రజలను లక్ష్యంగా చేసుకుని బోకో హరామ్ తీవ్రవాదులు దాడులు చేస్తున్నారని పోలీసు అధికారులు చెప్పారు. ఈ దాడులకు యువతులు, మహిళలను పావులుగా వాడుకుంటున్నారని పోలీసులు తెలిపారు.