ప్రధాని ఎవరైనా.. పాకిస్థాన్ తోక వంకరే!: భారత్తో సత్సంబంధాలంటూనే, కాశ్మీర్ మెలిక
ఇస్లామాబాద్: పాకిస్థాన్.. ఆ దేశ సారథులెవరైనా.. భారతదేశంతో సంబంధాలు మాత్రం మెరుగుపర్చుకునేందుకు ముందుకురారు. భారత్ పొరుగు దేశంతో సఖ్యత కోరుకున్నప్పటికీ.. ఆ దేశం మాత్రం స్నేహ హస్తం అందించదు. ప్రభుత్వాలు మారినా కూడా ఆ దేశం తీరులో మాత్రం ఎలాంటి మార్పూ రాదు. తాజాగా, పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్ కూడా అదే విషయాన్ని మరోసారి రుజువు చేశారు.
కాశ్మీర్ మెలిక పెట్టిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నామని, అయితే కాశ్మీర్ సమస్య పరిష్కారం లేకుండా అది సాధించలేమని పాకిస్థాన్కి కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. దేశ 23వ ప్రధానిగా ఎన్నికైన తర్వాత పార్లమెంట్లో షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా భారత్తో సత్సంబంధాలు సాధించలేమని అన్నారు. అంతేగాక, అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తామని పేర్కొన్నారు.
పాకిస్థాన్కు పదే పదే తేల్చి చెప్తున్న భారత్
ఆగస్టు 2019లో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలను ఉపసంహరించుకోవడం, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు న్యూఢిల్లీ ప్రకటించిన తర్వాత భారతదేశం-పాకిస్థాన్ మధ్య సంబంధాలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ దేశంలో అంతర్భాగంగానే ఉంటుందని భారత్ పదే పదే పాకిస్థాన్కు స్పష్టం చేసింది. ఉగ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణంలో పాక్తో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నామని భారత్ పాకిస్థాన్కు ఇప్పటికే తేల్చిచెప్పింది.
ఇమ్రాన్ దిగిపోవడంతో.. పాక్ కొత్త ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్
కాగా, జాతీయ అసెంబ్లీలో మద్దతు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ దిగిపోయిన క్రమంలో పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రిగా పీఎంఎల్(ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన షెహబాజ్కు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ప్రధాని ఎన్నిక ఏకగ్రీవమైంది. అంతేగాక, పీటీఐ తరపునన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న షా మొహమ్మద్ ఖురేషీ ఈ పోటీ నుంచి తప్పుకోవడంతో షెహబాజ్కు లైన్ క్లియర్ అయ్యింది. కాగా, మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న షెహబాజ్ షరీఫ్ తోపాటు ఆయన కుమారుడికి పాకిస్థాన్ కోర్టులో ఊరట లభించింది. న్యాయస్థానానికి హాజరుతోపాటు అరెస్టుకు సంబంధించి ముందస్తు బెయిల్ ను పొడిగించింది కోర్టు. ఈ కేసును ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. దీంతో పీఎంఎల్(ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్కు ఉన్న అన్ని చిక్కులూ తొలగినట్లయింది. అంతకుముందు పరిణామాలు గమనించినట్లయితే.. పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు అక్కడి జాతీయ అసెంబ్లీ సోమవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశమైంది. ఇతర పార్టీల సభ్యులందరూ హాజరైనప్పటికీ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్షాఫ్(పీటీఐ) సభ్యులు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.