ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ రంజాన్ ప్రార్థనలపై ఆంక్షలు..ఎందుకంటే..?
ముంబై పేలుళ్ల సూత్రధారి జమాత్ - ఉద్ -దవా చీఫ్ హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ ప్రభుత్వం షాకిచ్చింది. ఈద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు అనుమతి నిరాకరించింది. ఆయనకు ఇష్టమైన ఖదాఫీ స్టేడియంలో ప్రతి ఏటా హఫీజ్ సయీద్ ప్రార్థనలు నిర్వహిస్తారు. అయితే అందులో కాకుండా స్డేడియం పక్కనే ఉన్న స్థానిక మసీదులో ఆయన ప్రార్థనలు చేయాల్సి వచ్చింది.
గడాఫీ స్టేడియంలో హఫీజ్ సయీద్ ప్రార్థనలు చేసేందుకు అనుమతి కోరగా పంజాబ్ ప్రభుత్వం ఇందుకు నిరాకరించింది. ప్రభుత్వం మాట పెడచెవిన పెట్టి ప్రార్థనలు చేస్తే అతన్ని అరెస్టుకు కూడా వెనకాడబోమని అధికారులు స్పష్టం చేశారు. ఇక వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో హఫీజ్ సయీద్ గడాఫీ స్టేడియంలో ప్రార్థనలు చేయాలన్న ఆలోచన విరమించుకున్నాడు.
గత కొన్నేళ్లుగా గడాఫీ స్టేడియంలో రంజాన్ బక్రీద్ సందర్భంగా హఫీజ్ ప్రార్థనలు చేస్తూ వస్తున్నారు. హఫీజ్ స్టేడియంకు చేరుకుంటున్న సమయంలో ఆయనకు గట్టి భద్రతను పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసేది. మరోవైపు ప్రార్థనలతో పాటుగా అతనికున్న ఉగ్రవాద ఆలోచనలు ప్రజలపై తన ప్రసంగం ద్వారా రుద్దేవాడు. ప్రత్యేకించి కశ్మీర్పై రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవాడు. 2008, డిసెంబర్ 10న హఫీజ్ సయీద్ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అతను నడుపుతున్న జమాఉత్-దవాపై నిషేధం విధించింది. ముంబై మారణహోమం వెనుక హఫీజ్ సయీద్దే మాస్టర్ బ్రెయిన్. ఆ మారణహోమంలో 166 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు.
జైషేమహ్మద్ సంస్థ, లష్కరేతొయిబా, జమాఉత్ దువా లాంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ నిధులు సమకూర్చడాన్ని తప్పుబట్టింది పారిస్లోని ఓ నిఘా సంస్థ . ఈ ఏడాది మార్చిలోనే మసీదుల్లో హఫీజ్ సయీద్ ప్రసంగాలు చేయడంపై నిషేధం విధించింది పాకిస్తాన్. పంజాబ్ ప్రభుత్వం కింద నడిచే మసీదు ఖద్సియాలో ప్రతి శుక్రవారం హఫీజ్ ప్రార్థనలు నిర్వహించడంతో పాటు ప్రసంగాలు చేసేవాడు.
ఇక లష్కర్ తొయిబాకు కుడిభుజంగా పనిచేస్తుంది జమాఉద్ దవా. 2014 జూన్లో ఉగ్రవాద సంస్థగా యూఎన్ జాబితాలో చేర్చింది. హఫీజ్ సయీద్ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో 2012లో చేర్చింది. ఆయన్ను పట్టించిన వారికి 10 మిలియన్ డాలర్లు కూడా బహుమానం ప్రకటించింది.