హైతి కార్నివాల్లో అపశృతి: విద్యుత్ తీగతెగిపడి 18మంది మృతి
హైతీ: ఉత్తర అమెరికాలోని హైతి దేశ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్లో జరిగిన కార్నివాల్లో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం వేల సంఖ్యలో ప్రజలు నగర వీధుల్లో కార్నివాల్ సంబరాలు వీక్షిస్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ తీగ తెగిపడింది.
దీంతో విద్యుత్ ఘాతం సంభవించి 18 మంది ప్రజలు మృతి చెందారు. విద్యుత్ తీగ నుంచి మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. దీంతో కొంత తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులను అంబులెన్స్ల్లో ఆస్పత్రులకు తరలించారు. కొంతమంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
కొందరు కర్రలతో విద్యుత్ తీగను తప్పించారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ‘నేను విద్యుత్ తీగ పడటం చూశాను. వెంటనే ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశాను' అని నటాచా సెయింట్ అనే వ్యక్తి మీడియాకు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారని చెప్పారు. కాగా, ఆ దేశ అధ్యక్షుడు మైకేల్ మార్టెల్లీ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ట్విట్టర్లో ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.