కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు: ఏడుగురు మృతి, పలువురికి గాయాలు
వాషింగ్టన్: అమెరికాలో రోజు రోజుకు కాల్పుల ఘటనలో మరింతగా పెరిగిపోతున్నాయి. తాజాగా, కాలిఫోర్నియాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. కాలిఫోర్నియాలోని హాఫ్మూన్ బే ప్రాంతంలో రెండు చోట్ల దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరికొంతమంది గాయాలపాలయ్యారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇటీవల లాస్ఏంజెల్స్ సమీపంలోని మాంటేరీపార్క్లో కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చైనీయుల లూనార్ కొత్త సంవత్సర వేడుకలపై దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
సోమవారం రోజున అయోవా డెస్ మోయిన్స్లోని యూత్ ఔట్ రీచ్ సెంటర్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
ఒకరోజు క్రితం షికాగోలో తెలుగు విద్యార్థులపై నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. దేవ్ శిష్ అనే హైదరాబాద్ కు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. సాయిచరణ్ అనే మరో యువకుడు కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. విశాఖకు చెందిన మరో యువకుడు లక్ష్మణ్ కాల్పుల నుంచి తప్పించుకున్నాడు. ఉన్నత చదువుల కోసం పది రోజుల క్రితమే వీరు అమెరికా వెళ్లారు. ఇంతలోనే ఈ ఘోరం జరగడం వారి కుటుంబాల్లో విషాదం నింపింది.