Israel-Palestine War : బందీల్ని చంపేస్తామని హమాస్ హెచ్చరిక-గాజా కైవసానికి ప్రయత్నిస్తే..
ఇజ్రాయెల్ పై భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో మెరుపుదాడులు చేసి వందల సంఖ్యలో విదేశీయుల్ని బందీలుగా పట్టుకుపోయిన పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు ఇప్పుడు వారిని అడ్డుపెట్టి పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ పై దాడుల తర్వాత తమ ఆధీనంలోని గాజా స్ట్రిప్ ప్రాంతంపై జరుగుతున్న ప్రతిదాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న హమాస్.. ఇప్పుడు వాటిని ఆపకపోతే తమ దగ్గర ఉన్న బందీల్ని చంపేస్తామని హెచ్చరికలు పంపింది.
ఇజ్రాయెల్ తో దీర్ఘకాలిక యుద్ధానికి సిద్దమవుతున్న పాలస్తీనా తీవ్రవాద గ్రూపు హమాస్.. విదేశీ బందీల్ని చెరలో ఉంచుకుని ప్రత్యర్ధిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ పౌరులతో పాటు అమెరికా, బ్రిటన్, నేపాల్,థాయిలాండ్ వంటి దేశాల ప్రజల్ని కూడా అడ్డుపెట్టి ప్రత్యర్ధికి సవాళ్లు విసురుతోంది. ఇప్పటికే హమాస్ దాడులు మొదలుపెట్టి మూడు రోజులు కావడంతో అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇజ్రాయెల్ కు అండగా ఆయుధాలు, యుద్ధ విమానాలు, నౌకల్ని పంపుతున్నాయి.

ఈ నేపథ్యంలో గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ దాడులు కూడా ముమ్మరం అవుతున్నాయి. ఇప్పటికే గాజాలో దాదాపు 500 లక్ష్యాలపై దాడులు చేసిన ఇజ్రాయెల్.. రాబోయే రోజుల్లో వీటిని మరింత తీవ్రతరం చేయబోతోంది. దీంతో హమాస్ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న దాడుల్లో 1500 మంది వరకూ పౌరులు ఇరువైపులా చనిపోయారు.
ఇజ్రాయెల్ ప్రస్తుతం గాజా స్ట్రిప్పై పూర్తి ముట్టడి విధించి నీటి సరఫరాను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో పాలస్తీనా హమాస్ గ్రూపు తమ వద్ద బందీలుగా ఉన్న వారిని చంపేస్తానని బెదిరించింది. దీంతో ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. 3 లక్షల మంది సైనికులను యుద్దంలోకి దింపేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందన్నారు. తాము ఈ యుద్ధాన్ని కోరుకోలేదని, ఇది అత్యంత క్రూరంగా తమపై బలవంతంగా రుద్దారన్నారు. అయితే ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ప్రారంభించనప్పటికీ, పూర్తిచేస్తుందని నెతన్యాహు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications