పాక్ విమానం హైజాక్, ముగ్గురిని ఉరి తీశారు
కరాచి: పాకిస్థాన్ విమానాన్ని హైజాక్ చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలకు ఉరి శిక్ష అమలు చేశారు. అణు పరిక్షలు నిర్వహించి 17 సంవత్సరాలలోకి అడుగు పెట్టిన రోజు ఆ ముగ్గురు ఖైదీలకు శిక్ష అమలు చేశామని పాక్ అధికారులు తెలిపారు.
1998వ సంవత్సరంలో పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహించింది. 1998 మే 24వ తేదిన పాకిస్థాన్ కు చెందిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ విమానం PIA Fokker F 27 హైజాక్ చెయ్యడానికి ప్రయత్నించారు. విమానంలో 33 మంది ప్రయాణికులు, ఐదు మంది సిబ్బంది ఉన్నారు.
విమానాన్ని పాకిస్థాన్ నుండి భారత్ లోని ఢిల్లీకి తీసుకురావడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ అక్కడి అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో షబ్బీర్ రిండ్, షహష్వార్ బలోచ్, షబ్బీర్ బలోచ్ అని అధికారులు గుర్తించారు.
ఈ ముగ్గురు బలోచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కు చెందిన వారని పాక్ అధికారులు గుర్తించారు. ముగ్గురిని జైలుకు తరలించారు. ఈ ముగ్గురు విమానం హైజాక్ చేసి భారత్ తీసుకు వెళ్లి అణు పరిక్షలను అడ్డుకోవడానికి ప్రయత్నించారని కేసులు నమోదు అయ్యాయి.
పాక్ న్యాయస్థానం ముగ్గురికి మరణ శిక్ష విధించింది. గురువారం అణు పరిక్షలు నిర్వహించి 17 సంవత్సరాలు అయిన సందర్బంగా పాక్ సంబరాలు జరుపుకునింది. ఇదే సమయంలో ముగ్గురిని ఉరి తియ్యాలని అక్కడి అధికారులు నిర్ణయించారు.
షహష్వార్ బలోచ్, షబ్బీర్ బలోచ్ లను పాకిస్థాన్ లోని హైదరాబాద్ లోని జైలులో ఉరి తీశారు. షబ్బీర్ రిండ్ ను కరాచిలోని జైలులో ఉరి తీశారు. ఈ ముగ్గురిని ఉరి తీసినట్లు పాకిస్థాన్ అధికారులు అధికారికంగా ధృవీకరించారు.