పాకిస్తాన్ నీడలోనే తాలిబన్ సర్కార్-బరాదర్ పై హక్కానీలదే పైచేయి-సొంత సర్కార్ లో బందీ ?
ఆప్ఘనిస్తాన్ లో కొత్తగా ఏర్పడిన తాలిబన్ల ప్రభుత్వం ఇంకా కుదురుకోనే లేదు. అప్పుడే వారిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారం, ఆధిపత్యం, వ్యూహాలు, షరియా చట్టాలు ఇలా అనేక విషయాల్లో తాలిబన్లకు గతంలో తాము కలిసి పనిచేసిన ఐసిస్, హక్కానీలు, ఇతర గ్రూపులతో విభేధాలు బయటపడుతున్నాయి. ఈ విభేదాల కారణంగానే హైబతుల్లా అఖుంద్ జాదా ఆప్ఘన్ అధ్యక్ష పదవినీ, ముల్లా బరాదర్ ప్రధాని పదవినీ కోల్పోయినట్లు అర్ధమవుతోంది. అదే సమయంలో ఈ విభేదాలతో పాకిస్తాన్ మద్దతున్న హక్కానీలు డిప్యూటీ ప్రధాని ముల్లా బరాదర్ నూ కంట్రోల్ చేస్తున్నారు.
ఆప్ఘన్ రణరంగంలో తాలిబన్లకు చుక్కలు
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేపట్టిన తాలిబన్లకు ప్రభుత్వ ఏర్పాటు నుంచే తలనొప్పులు మొదలయ్యాయి. ప్రభుత్వంలో ఎవరుండాలి, మంత్రి పదవుల్లో ఎవరెవరికి ప్రాతినిధ్యం కల్పించాలి, పాకిస్తాన్ చెప్పినట్లు వినాలా వద్దా ఇలా పలు అంశాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి పాకిస్తాన్ చెప్పిన నలుగురు హక్కానీ కుటుంబ సభ్యులతో పాటు ఇద్దరు తజక్కులతో పాటు తాలిబన్ గ్రూపులోని ఇతరులకు ఇందులో చోటు కల్పించారు. ఇలా 33 మందితో ఏర్పడిన తాలిబన్ కేబినెట్ ఇప్పుడు సక్రమంగా పాలన సాగించగలుగుతుందా అంటే అదీ లేదు.
ఐసిస్ తో తాలిబన్ల పోరు
ఒకప్పుడు సున్నీ ముస్లిం గ్రూపు అయిన ఐసిస్ తో కలిసి ప్రయాణించిన తాలిబన్లు ఇప్పుడు అదే ఐసిస్ ను చూసి వణికిపోతున్నారు. ఐసిస్ ను నియంత్రించకపోతే తమ ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డపేరు వస్తుందోనని భయపడుతున్నారు. దీంతో వారిని నియంత్రించే క్రమంలో తమ ప్రభుత్వంలో అన్ని వ్యూహాలు వాడేస్తున్నారు. అయినా ఐసిస్ కు అడ్డుకట్ట వేయడం సాధ్యమయ్యేలా లేదు. మరోవైపు తాలిబన్ల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ముందు కాబూల్ ఎయిర్ పోర్టులో ఆత్మాహుతి దాడులు జరిపి దాదాపు 140 మందిని పొట్టనబెట్టుకున్న ఐసిస్.. తాజాగా జలాలాబాద్ లో తాలిబన్ల ట్రక్కుల్ని టార్గెట్ చేసి మరో 35 మంది ప్రాణాలు తీసింది. దీంతో ఐసిస్ ను ఎదుర్కోవడం తాలిబన్లకు పెను సవాల్ గా మారిపోతోంది.
హక్కానీలతో తాలిబన్ల పోరు
కొత్తగా ఏర్పాటు చేసిన తాలిబన్ సర్కార్ లో పాకిస్తాన్ ఒత్తిడితో నలుగురు హక్కానీలకు చోటు కల్పించక తప్పలేదు. వీరంతా అమెరికా తో పాటు పలు దేశాల మోస్ట్ వాంటెండ్ జాబితాలో ఉన్న వారే. వీరిని ప్రభుత్వంలో రాకుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించినా పాకిస్తాన్ ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. ఓవైపు అంతర్జాతీయంగా తమ ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న తాలిబన్లకు హక్కానీల ఎంట్రీ తలనొప్పిగా మారింది. వీరంతా మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులే కావడంతో వీరితో కూడిన తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపు నిచ్చేందుకు చైనాతో పాటు ఇతర దేశాలూ జంకుతున్న పరిస్దితి. అటు అమెరికా, బ్రిటన్ తో పాటు నాటో దేశాలు అయితే తమ మోస్ట్ వాంటెండ్ జాబితాలో ఉన్న వారిని మంత్రులుగా నియమిస్తారా అంటూ ఐరాస ద్వారా తాలిబన్లపై ఒత్తిడి పెంచుతున్నారు.
తాలిబన్ల సర్కార్ లో హక్కానీలదే పైచేయి
పాకిస్తాన్ మద్దతుతో తాలిబన్ల ప్రభుత్వంలో చోటు దక్కించుకున్న నలుగురు హక్కానీ కుటుంబ సభ్యులు ఇప్పుడు తమ పని తాము చేసుకుపోతున్నారా అంటే అదీ లేదు. ప్రభుత్వంలో డిప్యుటీ ప్రధానిగా నియమితుడైన అంతర్జాతీయ దౌత్యవేత్త, ముల్లా బరాదర్ ను కెలుకుతున్నారు. ఆయన డిప్యూటీ ప్రధాని అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు. వాస్తవానికి పాకిస్తాన్ అంటే గిట్టని ముల్లా బరాదర్ హక్కానీలను ఎదుర్కొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీంతో తాలిబన్ల సర్కార్ లో హక్కానీలు వర్సెస్ తాలిబన్ల పోరు కొనసాగుతోంది. దీంతో చివరికి ముల్లా బరాదర్ కాందహార్ కు పారిపోయారు.
Recommended Video
సొంత ప్రభుత్వంలో బందీగా ముల్లా బరాదర్ ?
తాలిబన్ల సర్కార్ లో పేరుకు డిప్యూటీ ప్రధానే అయినా ఏ విషయంలోనూ ముల్లా బరాదర్ కు పరిస్ధితులు కలిసి రావడం లేదు. ముందు ప్రధాని పదవికి తన పేరు ప్రతిపాదించగా.. దానికి పాకిస్తాన్ అడ్డుపడింది. దీంతో ఉప ప్రధానితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సరే ప్రభుత్వంలో అయినా తగిన గౌరవం ఉందా అంటే అదీ లేదు. హక్కానీలతో నిత్యం పోరు కొనసాగించాల్సిన పరిస్దితి. దీంతో ఆయన కాందహార్ కు పారిపోయారు. చివరికి బరాదర్ ను తీసుకొచ్చి తాలిబన్ల సర్కార్ ఆయనతో తమలో ఎలాంటి విభేదాలు లేవని టీవీల్లో చెప్పించాల్సి వచ్చింది. ఆ వీడియో సందేశంలోనూ ఆయన చుట్టూ పెట్టిన కాపలా చూస్తే బందీలాగే కనిపిస్తున్నారంటూ పాశ్చాత్య మీడియాలో వార్లలొస్తున్నాయి.