ఇంకా ప్రమాద ఘంటికలే: గంటకు 72కి.మీ వేగంతో.. మరోసారి తీరం దాటిన హార్వీ
వర్షాల జోరు తగ్గకపోవడంతో పాటు గురువారానికల్లా 150సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
హోస్టన్: అమెరికా టెక్సాస్లో హర్రీకేన్ హార్వీ తుఫాన్ ఎఫెక్ట్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వర్షాల జోరు తగ్గకపోవడం.. గురువారానికల్లా 150సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి.
బిక్కుబిక్కుమంటూ: ఇద్దరి పరిస్థితి విషమం, హర్రీకేన్ బాధితులకు తానా, ఆటా ఆపన్నహస్తం
తుఫాన్ ప్రభావంతో బుధవారం నాటికి మృతుల సంఖ్య 30కి చేరింది. వరదల ప్రభావం తగ్గితే కానీ దీనిపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. వరదలు తగ్గుముఖం పడితే భారీ సంఖ్యలో మృతదేహాలు, మృతుల వివరాలు లభించే అవకాశం ఉంది.
హోస్టన్లో కర్ఫ్యూ:
వరదలను అవకాశంగా మలుచుకుని దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉండటంతో నేరాలను నివారించేందుకు హోస్టన్ నగరంలో అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కర్ఫ్యూ విధించారు. వరదలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నాయి. హోస్టన్, దాని సమీప ప్రాంతాల నుంచి ఇప్పటివరకు చిక్కుకున్న 13వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Recommended Video
లూసియానాపై ఎఫెక్ట్:
హర్రీకేన్ హార్వీ తుఫాన్ ఎఫెక్ట్ లూసియానాపై కూడా పడింది. బుధవారం లూసియానాలో గంటకు 72కి.మీ వేగంతో గాలులు వీస్తుండగా తుఫాన్ మరోసారి తీరాన్ని తాకింది. 2005లో కత్రినా తుఫాన్ లూసియానాలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. హార్వీ గత శుక్రవారమే టెక్సాస్ లో తొలిసారి తీరాన్ని తాకిన సంగతి తెలిసిందే.
కేమరూన్ సమీపంలో:
కేమరూన్ పట్టణానికి సమీపంలో హార్వీ తాజాగా తీరాన్ని తాకినట్లు అమెరికా వాతావరణ విభాగం తెలిపింది. తీవ్రత ప్రకారం హార్వీని నాలుగోరకం తుఫాన్ గా పేర్కొనడం గమనార్హం. లూసియానాలో ఇంకా 13నుంచి 25సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బుధవారం రాత్రి నుంచి తుఫాన్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
భారతీయుల సహాయం:
వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత సంతతి ప్రజలు పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బాధితులకు ఆహారం, వైద్య సదుపాయాలు అందేలా తమవంతు సహాయం అందిస్తున్నారు. అబీజార్ త్యేబ్జి అనే వ్యక్తి 1500మందికి ఆహారం సరఫరా చేసినట్లుగా తెలుస్తోంది.
ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ గ్రేటర్ హోస్టన్, స్థానిక రెస్టారెంట్ మద్రాస్ పెవిలియన్ కలిసి పునరావాస శిబిరాల్లో ఉన్న 500మందికి ఆహారం అందించారు. భారతీయ వ్యాపార సంస్థలు, ప్రార్థన స్థలాలు చాలామంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. హిందూస్ ఆఫ్ గ్రేటర్ హోస్టన్, ఇండియా హౌజ్, ఇండియా కల్చర్ సెంటర్, ది ఇండో-అమెరికన్ చారిటీ ఫౌండేషన్ తదితర సంస్థలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.