నేను ఎంత బాధపడ్డానో:దొంగతనంపై పాప ఓపెన్ లెటర్
లండన్: తనకు పుట్టిన రోజునాడు బహుమతిగా వచ్చిన వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. ఆ దొంగలకు పుట్టిన రోజు వేడుక జరుపుకున్న చిన్నారి బహిరంగ లేఖ రాసింది. ఆమె రాసిన ఆ లేఖ అందర్నీ కదిలిస్తుంది.
సాధారణంగా తమకు నచ్చిన వస్తువులను, బహుమతిగా వచ్చిన బొమ్మలను పిల్లలు దాచుకుంటారు. అంతగా అభిమానించి ఉన్నట్టుండి అవి పోతే చాలా బాధపడతారు. అలా తన బొమ్మలను దొంగలు ఎత్తుకెళ్లడంతో యూకేకు చెందిన పారిస్ ముల్ హోలాండే అనే 11 ఏళ్ల చిన్నారి బహిరంగ లేఖ రాసింది.
'మానవత్వం లేని మనుషులు.. నేను ఎంత బాధపడ్డానో.. నా మనసు ఎంత కష్టపడిందో వారికి తెలియజేయాలనే ఈ ఉత్తరం రాస్తున్నాను. వాళ్లు ఇప్పటికైనా పశ్చాత్తాప పడతారని భావిస్తున్నా. నా పడక గదిలో పడుకోవాలంటే భయంగా ఉంది. ఆ దుర్మార్గులు నా గదిలోకి వచ్చి నా వస్తువులను దోచుకెళ్లారు.

నేను చాలా భయాందోళనకు గురయ్యాను. ఇది ఎవరి గది, ఎవరి వస్తువులు అనేవి వారికి పట్టవు. నాకు చాలాకాలంగా చీకటి అంటే భయం. దానిని ఇప్పుడు అధిగమించాను. కానీ మీరు నా గదిలోకి వచ్చినప్పటి నుంచి భయం మళ్లీ నన్ను చుట్టుకుంది.
ఎందుకు ఇలా జరిగిందో తెలియదు. అందుకే బాగా ఏడ్చా. నాకు ఇష్టమైన డిస్నీ బొమ్మ లోగోను ధ్వంసం చేశారు. మా కుటుంబం కలిసి ఉన్న ఫోటో చూసిన తర్వాతనైనా వారి మనసు మారలేదా? వాళ్లకు తెలుసు. అది చిన్న పాప గది అని. అయినా ఈ పని చేశారు. నిజంగా నన్ను భయపెట్టినందుకు ధన్యవాదాలు' అని ఆ పాప రాసింది. అలాగే, ఇతరులకు జాగ్రత్తలు చెప్పింది.
యూకేలోని సౌత్ యార్క్ షైర్లో ఈ సంఘటన జరిగింది. పాప ఇంట్లోకి చొరబడిన దొంగలు విలువైన వస్తువులు, నగలు దోచుకెళ్లారు. వారం క్రితం ఆమె పుట్టిన రోజు సందర్భంగా.. ఆమెకు వచ్చిన బహుమతులు కూడా దొంగిలించారు. వాళ్ల ఫ్యామిలీ ట్రిప్ ఫోటోలు ఉన్న ఐ ఫోన్ ఎత్తుకెళ్లారు. ఆ పాప రాసిన ఉత్తరం అందర్నీ కదిలించింది.












Click it and Unblock the Notifications