నిన్న వరదలు..నేడు వడగాలులు: జపాన్ను కుదిపేస్తోన్న ఎండలు..14మంది మృతి
జపాన్లో వడగాలులు దడపుట్టిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వరదల నుంచి కోలుకుంటున్న జపాన్ను ఈసారి వడగాలుల అక్కడి ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నాయి. మూడురోజులుగా వడగాలుల ధాటికి 14 మంది మృతి చెందారు. గతవారం వరదల ధాటికి 200 మంది మృతిచెందారు. అక్కడి ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలు నమోదవుతున్నాయని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో గాలిలో తేమశాతం కూడా పెరిగి అక్కడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. పరివేష్టిత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును తాకుతున్నాయి.
ఇబిగావా నగరంలో అత్యధికంగా 39.3 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద ఇదే అత్యధికంగా నమోదైన టెంపరేచర్ అని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు టోక్యో నగరంలో 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. వరదల ధాటికి విలవిలలాడిపోయిన పశ్చిమ జపాన్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 34.3 డిగ్రీల సెల్సియస్గా రికార్డయ్యాయి.

వరదలు సృష్టించిన బీభత్సానికి అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి. అయితే వడగాలుల దెబ్బకు వాలంటీర్లు సహాయక చర్యలు చేపట్టలేక పోతున్నారు. వడగాలులు అడ్డంకిగా మారాయని వారు వాపోతున్నారు. దీంతో వారు మంచినీళ్లను వెంటనే ఉంచుకుని సహాయకచర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
జపాన్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కును తాకితేనే అది ప్రమాదకరంగా అక్కడి అధికారులు ప్రజలను హెచ్చరిస్తారు. అలా ఆ దేశంలో 200 ప్రాంతాల్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గతేడాది అధిక ఉష్ణోగ్రతల ధాటికి జపాన్లో 48మంది మృతి చెందినట్లు ఆదేశ గణాంకాలు చెబుతున్నాయి. ఈ సారి కూడా అదేస్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయని ఇవి భారత దేశంలో ఉన్న టెంపరేచర్స్తో పోలిస్తే తక్కువే అయినప్పటికీ...ఇక్కడ వాతావరణానికి అలవాటు పడ్డ వారికి ఈ ఎండలు నరకం చూపిస్తున్నాయని టోక్యోలో ఓ ప్రెవేట్ కంపెనీలో టెక్కీగా పనిచేసే తెలుగు వ్యక్తి పులి నాగవర్ధన్ రెడ్డి తెలిపాడు.












Click it and Unblock the Notifications