చరిత్రలో ఇలా: క్షిపణి దాడుల్లో ఎన్ని విమానాలు కూలాయి..ఎంతమంది మరణించారు..?
అమెరికా ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ భూభాగంపై జరిగిన ఉక్రెయిన్ విమాన ప్రమాదం తమ తప్పిదం వల్ల జరిగినదే అని ఇరాన్ ప్రకటించింది. ఈ ప్రమాదంలో మొత్తం 176 మంది మృతి చెందారు. అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ చేసిన క్షిపణి ప్రయోగంలో ఓ క్షిపణి ఉక్రెయిన్ విమానంను ఢీకొట్టడంతో విషాదం నెలకొంది. ఇక చరిత్రలో క్షిపణి దాడులకు బలైన విమానాలు ఆ ఘటనల్లో మృతులు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం.

మలేషియా ఎయిర్లైన్స్ ఘటనలో 298 మంది మృతి
2014 జూలై 17న ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్కు బయలుదేరిన మలేషియన్ ఎయిర్లైన్స్ విమానంను ఉక్రెయిన్ గగనతలంలో క్షిపణి ఢీకొనడంతో అది కూలింది. ఈ ఘటనలో 298 మంది మృతి చెందారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న వేర్పాటువాదులైన రష్యా రెబెల్స్, కివ్ అధికారులు క్షిపణి దాడులకు దిగారు. ప్రమాదంకు కారణం కివ్ అధికారులని రష్యా రెబెల్స్ ఆరోపణలు చేయగా... విమానంను కూల్చింది రష్యా రెబెల్సే అని కివ్ అధికారులు చెప్పారు. ఈ ఘటనలో 193 మంది డచ్ జాతీయులు మృతిచెందారు.

సోమాలియా, నల్ల సముద్రంపై కూలిన విమానాలు
మార్చి 23,2007లో బెలారసియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం సోమాలియా రాజధాని మొగదీషు నుంచి టేకాఫ్ తీసుకున్న కాసేపటికే ఓ రాకెట్ ఢీకొని విమానం కూలింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో విమానంను ఓ క్షిపణి ఢీకొట్టడంతో దాన్ని రిపేరు చేసి ఇలియూషిన్ II-76 కార్గో విమానంలో ఈ ఇంజినీర్లు తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది. ఇక అక్టోబర్ 4, 2004లో నల్ల సముద్రంపై రష్యాకు చెందిన విమానం కూలింది. ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవివ్ నుంచి నోవోసిబర్క్స్కు బయలు దేరిన ఈ విమానంను ప్రమాదవశాత్తు ఉక్రెయిన్ క్షిపణి ఢీకొనడంతో కూలింది. ఈ ఘటనలో 78 మంది మృతి చెందారు.

ఇరాన్ విమానంను కూల్చిన అమెరికా క్షిపణులు
జూలై 3, 1988లో ఇరాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం బందార్ అబ్బాస్ నుంచి దుబాయ్కు వెళుతుండగా అమెరికా ప్రయోగించిన రెండు క్షిపణులు ఢీకొట్టడంతో ఆ విమానం కూలింది. ఇరాన్ సముద్ర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 290 మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో 66 మంది చిన్నారులు ఉన్నారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జోక్యంతో అమెరికా ఇరాన్కు పరిహారంగా 101.8 మిలియన్ డాలర్లను చెల్లించింది. అయితే పరిహారం మాత్రమే చెల్లించిన అమెరికా జరిగిన ఘటనకు క్షమాపణ కోరలేదు.
Recommended Video

సీనాయి ఎడారిలో కూలిన విమానం..ఇజ్రాయిల్దే బాధ్యత
సెప్టెంబర్ 1, 1983లో కొరియన్ ఎయిర్లైన్స్కు చెందిన సౌత్ కొరియన్ విమానంను సోవియట్ ఫైటర్ జెట్ సఖాలిన్ దీవులపై కూల్చింది. ఈ ఘటనలో 269 మంది ప్రయాణికులు మృతి చెందారు.అయితే ఐదు రోజుల తర్వాత ఈ పని చేసింది తామే అని సోవియట్ అధికారులు ప్రకటించారు.
ఇక 1973 ఫిబ్రవరి 21న లిబియాకు చెందిన లిబియన్ అరబ్ ఎయిర్లైన్ బోయింగ్ 727 విమానంను సీనాయ్ ఎడారిలో ఇజ్రాయిల్ ఫైటర్ జెట్లు కూల్చాయి. ఈ విమానం ట్రిపొలీ నుంచి కైరోకు వెళుతుండగా ఫైటర్ జెట్లు కూల్చాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలతో బయటపడగా 112 మంది చనిపోయారు. సీనాయి ఎడారి గగనతలంలో ఈ విమానం ఎగిరినందున ఇజ్రాయిల్ ఎయిర్ఫోర్స్ కూల్చినట్లు తెలిపింది. ఆ సమయంలో సీనాయి ఎడారి ఇజ్రాయిల్ అధీనంలో ఉండేది. విమానం ల్యాండ్ చేయనందుకే దాన్ని కూల్చివేశామని ఇజ్రాయిల్ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications