అమెరికా ఎన్నికల తొలి ఫలితం: హిల్లరీ ఖాతాలో తొలి గెలుపు
వాషింగ్టన్: ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఅమెరికా ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. న్యూ హ్యాంప్షైర్లోని డిగ్జ్విల్లే నాచ్లో పోలింగ్ పూర్తయి ఫలితం వచ్చేసింది. ఇక్కడి 8 ఓట్లలో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 4 ఓట్లు గెలుచుకోగా, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 2 ఓట్లు గెలుచుకున్నారు.
దీంతో 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ తొలి గెలుపు నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఎనిమిది మంది ఓటర్లు ఓటు వేయగా నాలుగు హిల్లరీకి, రెండు ట్రంప్కు, స్వతంత్రులు గేరీ జాన్సన్, మిట్టీ రోమ్నీ చెరొక ఓటును గెలుచుకున్నారు.
కెనడా సరిహద్దు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరిలో 24 గంటల ముందుగానే తొలి ఫలితం వెలువడుతుంది. ఎందుకంటే ఇక్కడ అర్థరాత్రి పోలింగ్ మొదలవుతుంది. అంతేగాక, అధ్యక్ష ఎన్నికల్లో ఇక్కడే పోలింగ్ ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది.
అమెరికాలో 12 గంటల పాటు పోలింగ్ జరిగిన తర్వాత ఒక్కో రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలను మూసేస్తారు. ఆ వెంటనే కౌంటింగ్ మొదలవుతుంది. టైమ్ జోన్లు వేర్వేరుగా ఉండటం వల్ల ఒక చోట ఫలితాలు వెలువడుతున్న సమయానికి మరో రాష్ట్రంలో పోలింగ్ కొనసాగుతూనే ఉంటుంది. మంగళవారం సాయంత్రం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది. బుధవారమే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.