అదే జరిగితే మన దేశం పని అంతే!: పాకిస్తాన్ హిందూ చట్టసభ్యుడు
మైనార్టి బిల్లును సింధ్ ప్రభుత్వం కనుక రద్దు చేస్తే పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకాకి కావడం ఖాయమని హిందూ చట్ట సభ్యులు డాక్టర్ రమేష్ కుమార్ వంకవాని హెచ్చరించారు.
ఇస్లామాబాద్: మైనార్టి బిల్లును సింధ్ ప్రభుత్వం కనుక రద్దు చేస్తే పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకాకి కావడం ఖాయమని హిందూ చట్ట సభ్యులు డాక్టర్ రమేష్ కుమార్ వంకవాని హెచ్చరించారు. సింధ్ క్రిమినల్ లా బిల్లు 2015ను సవరించడం లేదా రద్దు చేయడం చేయాలని సింధ్ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చాయి.
దీనిపై అధికార పీఎంల్(ఎన్) పార్టీ నేషనల్ అసెంబ్లీ సభ్యులు, పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ పార్టన్-ఇన్-చీఫ్ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. అతివాద మతపార్టీల ఒత్తిడితో బిల్లును కనుక రద్దు చేస్తే పాకిస్తాన్లోని మైనార్టీల్లో అభద్రతాభావం ఏర్పడుతుందన్నారు.
హిందూ అమ్మాయిలను అపహరించడం, బలవంతంగా మతమార్పిడులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల పాకిస్తాన్లో ఎక్కువయ్యాయని, తాము మత మార్పిడులకు వ్యతిరేకం కాదని, అయితే బలవంత మతమార్పిడులు మాత్రం కూడదన్నారు.
సింధు ప్రాంత్రంలో హిందూ బాలికలు మాత్రమే మతం ఎందుకు మారుతున్నారని ప్రశ్నించారు. సింధులోని వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు తనతోపాటు రావాలని మిగతా పార్లమెంటు సభ్యులను ఆహ్వానించారు. ప్రస్తుతం సింధులో నెలకొన్న పరిస్థితులు అక్కడి మైనారిటీలను అభద్రతాభావానికి, ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు.
కాగా, మైనార్టీ బిల్లును ఈ నెల 16న గవర్నర్కు పంపించారు. ఆయన దానికి ఆమోద ముద్ర వేసినా, వేయకున్నా అసెంబ్లీ దానిని సవరిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నిసార్ అహ్మద్ తెలిపారు. బలవంతపు మతమార్పిడులకు పాల్పడితే అయిదేళ ్ల జైలు శిక్ష విధించాలని సింధు ప్రభుత్వం బిల్లులో పేర్కొంది.
అయితే దీనిని జమాతీ ఇస్లామీ, జామిత్ ఇస్లామ్ ఎఫ్ ఈ వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్తాన్ లౌకిక, ఉదారవాదానికి ఈ బిల్లుతో కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జమాత్ ఉద్ దవా చీఫ్, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రమేశ్ స్పందించారు.