రక్షణ కల్పించండి మహాప్రభో- హిందువులు లేఖ
ఒట్టావా: భారత్- కెనడా మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్.. హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ స్వయానా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో చేసిన ప్రకటన రేపిన ప్రకంపనలు ఈ రెండు దేశాల మధ్య అగాథాన్ని సృష్టించాయి.
జూన్ 18వ తేదీన ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జార్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కెనడాలో ఈ హత్య చోటు చేసుకుంది. బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలోని గురుద్వారా బయట గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో ఆయన మరణించారు. ఈ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉందనేది కెనడా చేస్తోన్న ఆరోపణ.

అదే సమయంలో కెనడాలో నివసిస్తోన్న హిందువులందరూ దేశం విడిచి వెళ్లాలంటూ ఖలిస్తానీ వేర్పాటువాదులు ప్రకటించడం.. సమస్య తీవ్రతను మరింత పెంచినట్టయింది. ఏ క్షణమైనా ప్రాణాంతక దాడులు జరగొచ్చనే భయాందోళనలు కెనడాలో నివసిస్తోన్న హిందువుల్లో వ్యక్తమౌతోన్నాయి.
ఈ నేపథ్యంలో- తమకు రక్షణ కల్పించాలంటూ హిందూ ఫోరం కెనడా సభ్యులు.. జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కెనడా ప్రజా భద్రత వ్యవహారాల శాఖ మంత్రి డొమినిక్ లెబ్లాంక్కు లేఖ రాశారు. కెనడాలో నివసించే హిందువులందరూ దేశం విడిచి వెళ్లాలంటూ నిషేధిత సంస్థ సిక్ ఫర్ జస్టిస్ అధినేత గురుపత్వంత్ సింగ్ చేసిన ప్రకటనను ఇందులో పొందుపరిచారు.
కెనడాలోని వేర్వేరు నగరాలు, ప్రాంతాల్లో 10 లక్షల మందికి పైగా హిందువులు నివసిస్తోన్నారని, గురుపత్వంత్ సింగ్ ప్రకటన తరువాత వారంతా భయం నీడలో గడుపుతున్నారంటూ హిందూ ఫోరం కెనడా పేర్కొంది. ఇదే లేఖను వారు న్యూ డెమొక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్కు పంపించారు.
గురుపత్వంత్ సింగ్ చేసిన ప్రకటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని, దీన్ని భావ ప్రకటన స్వేచ్ఛగా ఎట్టి పరిస్థితుల్లోనూ భావించ వద్దని కోరారు. ఆయనపై చట్టపరమైన చర్యలను తీసుకోవడంతో పాటు తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమ దేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ రక్షణను కల్పించాల్సిన బాధ్యత కెనడా ప్రభుత్వంపై ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications