కరోనా : అమెరికా ఎక్కడ విఫలమైంది.. ఎందుకు విఫలమవుతోంది.. ఇంకెంతమంది బలవుతారు?
అమెరికా లాంటి అగ్ర రాజ్యం సైతం కరోనా వైరస్ దెబ్బకు ఇంతలా విలవిల్లాడిపోవడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. అన్ని రంగాల్లోనూ అత్యంత అభివృద్ది చెందిన అమెరికాకే ఇలాంటి పరిస్థితి తలెత్తితే.. ఇక పేద దేశాల పరిస్థితేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో అత్యంత శక్తివంతమైన దేశంగా పేరు తెచ్చుకున్న అమెరికా.. కరోనా వైరస్ను నియంత్రించడంలో ఎక్కడ తప్పటడుగులు వేసిందన్న చర్చ కూడా జరుగుతోంది. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి.

చైనాలో చేసినట్టు అమెరికాలో కుదరదు..
అమెరికాలో ఇప్పటివరకు 1,44,280 పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవగా.. 2587 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం కేసుల్లో 60,679 కేసులు న్యూయార్క్,13,386 కేసులు న్యూజెర్సీలో నమోదయ్యాయి. న్యూయార్క్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నా.. దేశ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటివరకు అక్కడ లాక్ డౌన్ ప్రకటించలేదు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ తరహాలో అమెరికన్ ప్రభుత్వానికి అమెరికాలో ఒకే విధమైన అధికార నియంత్రణ లేదు. ట్రంప్ క్వారెంటైన్ నిర్ణయానికి న్యూయార్క్,న్యూజెర్సీ రాష్ట్రాల గవర్నర్ల నుంచి వ్యతిరేకత రావడంతో అది అమలుకాలేదు. అమెరికాలో ఉన్నది ఫెడరల్ గవర్నమెంట్ కావడంతో.. చైనాలో చేసినట్టు అమెరికాలో కరోనా అనుమానితులను బలవంతంగా క్వారెంటైన్ చేయడం కుదరని పని.

గవర్నర్ల నుంచి వ్యతిరేకత
న్యూయార్క్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నా.. ఆ నగరం గుండా ప్రయాణాలను నిలిపివేయడం వంటి కఠిన చర్యలను ట్రంప్ తీసుకోలేకపోతున్నారు. నిజానికి న్యూయార్క్ సిటీ,న్యూయార్క్,న్యూజెర్సీ.. ఈ మూడు నగరాల నుంచి రాబోయే 14 రోజుల పాటు ప్రయాణాలను నిలిపివేయాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విజ్ఞప్తి చేసింది. ట్రంప్ సూచన మేరకే ఈ విజ్ఞప్తి చేసినట్టుగా చెబుతారు. అయితే ట్రావెల్ ఆంక్షలపై అక్కడి గవర్నర్లు పూర్తి విరుద్దంగా స్పందించారు. ఇలాంటి ఆంక్షలు యాంటీ అమెరికన్,యాంటీ సోషల్ అంటూ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఆర్థఇక వ్యవస్థ పతనానికి దారితీస్తాయని హెచ్చరించారు. అక్కడి గవర్నర్లకు పూర్తి స్థాయి విచక్షణాధికారులు ఉండటంతో ట్రంప్ కూడా ఏమీ చేయలేకపోతున్నారు.

ఇంకెంతమంది బలవుతారు..?
ఫలితంగా ఇప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టని పరిస్థితి నెలకొంది. దీంతో కరోనా వైరస్ సోకినవారు దేశమంతా ఇష్టారీతిన తిరుగుతూ వైరస్ను వ్యాప్తి చెందిస్తున్నారు. అదే చైనాలో.. హుబెయ్ ప్రావిన్స్లోని వుహాన్ నగరంలో వైరస్ తీవ్రత పెరిగిన వెంటనే ప్రావిన్స్ సరిహద్దులను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం మూసివేసింది. కానీ అమెరికాలో న్యూయార్క్ నుంచి ఇప్పటికీ ఎంతోమంది విమానాల ద్వారా.. కార్లు,బస్సుల ద్వారా ఇతర నగరాలకు ఇష్టమొచ్చినట్టుగా ప్రయాణిస్తున్నారు. వాళ్ల ద్వారా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికాలో లక్ష నుంచి 2లక్షల మంది వరకు చనిపోయే ప్రమాదం ఉందని ప్రముఖ వైద్యుడు డా.ఫౌసీ అభిప్రాయపడ్డారు.
Recommended Video

ట్రంప్ నిర్లక్ష్యం..
కరోనా వైరస్ నియంత్రణ పట్ల ట్రంప్ నిర్లక్ష్యం కూడా ఇంతటి విషాదానికి కారణమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 20న అమెరికాలో 35 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలడంతో దేశంలో తొలి కేసు నమోదైంది. అదే సమయంలో సౌత్ కొరియాలోనూ మొదటి పాజిటివ్ కేసు నమోదైంది. కానీ నియంత్రణ చర్యల విషయంలో అమెరికా,సౌత్ కొరియా మధ్య చాలా తేడాలున్నాయి. ఈ విషయంలో అమెరికా కాస్త ఆలస్యంగా మేలుకోవడంతో.. రెండు నెలల తర్వాత ఆ దేశం పరిస్థితి దారుణంగా ఉండగా.. సౌత్ కొరియాలో కేసులు తగ్గుముఖం పట్టాయి.అంతా కంట్రోల్లోనే ఉందంటూ కొద్దిరోజుల పాటు ట్రంప్ చేసిన ప్రకటనలు దేశాన్ని నిండా ముంచాయి. అంతకంతకూ వ్యాప్తి చెందుతోన్న ఆ వైరస్ ఎంతమందిని బలితీసుకుంటుందోనన్న ఆందోళన అక్కడివారిని వెంటాడుతోంది.












Click it and Unblock the Notifications