కరోనా ఎఫెక్ట్ : భారత్లోనే కాదు.. చాలా దేశాల్లో వారి పైనే చావు దెబ్బ.. థాయిలాండ్లో ఇదీ పరిస్థితి..
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన 21 రోజుల లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు,వలస కార్మికులు ఎంతలా విలవిల్లాడుతున్నారో మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఢిల్లీ నుంచి వేలాది మంది వలస జీవులు కాలి నడకనే సొంతూళ్లకు బయలుదేరారు. ఒక్క ఢిల్లీనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో.. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇది ఒక్క భారత్కే పరిమితం కాలేదు. మన పక్కనే ఉన్న థాయిలాండ్లోనూ లాక్ డౌన్ కారణంగా వలసజీవులు అల్లాడిపోతున్నారు.

థాయిలాండ్లో పరిస్థితి ఎలా ఉంది..
థాయిలాండ్లో గత వారం నుంచి లాక్ డౌన్ పాటిస్తున్నారు. దీంతో కూలీ పని చేసుకునే ఎంతోమంది కూలీలు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. వీరిలో చాలామంది మయన్మార్,కాంబోడియా,లావోస్ నుంచి వలస వచ్చినవారు. ఒక అంచనా ప్రకారం థాయిలాండ్లో దాదాపు 40లక్షల నుంచి 50లక్షల వలస కూలీలు ఉన్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్తో తిరిగి సొంత దేశం వెళ్దామనుకున్నవారు సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు. దాదాపు 30వేల పైచిలుకు మంది సరిహద్దులు దాటి తమ దేశాల్లోకి వెళ్లిపోయారు. అయితే సరిహద్దుల వద్దకు భారీ స్థాయిలో జనం చేరుకుంటుండటం వైరస్ వ్యాప్తికి కారణమవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని సరిహద్దులను మూసివేసింది. దీంతో లక్షలాది మంది వలస కూలీలు థాయిలాండ్లోనే చిక్కుుపోయారు. ఇప్పుడు వారంతా బిక్కుబిక్కుమంటూ బ్యాంకాక్ నగరంలోనే గడుపుతున్నారు.

ఒక్కసారిగా రోడ్డునపడ్డ వలస కార్మికులు
ప్రముఖ అంతర్జాతీయ మీడియా థాయిలాండ్లో వలసజీవుల పరిస్థితిపై ఆసక్తికర కథనం ప్రచురించింది. బ్యాంకాక్లో చిక్కుకుపోయిన మయన్మార్ వాసి మా మో(40) మోతో మాట్లాడగా అక్కడి పరిస్థితుల గురించి వివరించారు. చాలా ఏళ్లుగా తాను అక్కడే పనిచేస్తున్నానని.. స్వదేశానికి వెళ్లడమనేది తనకేమీ ఆప్షన్ కాదని అన్నారు. తాను ఓ సిల్క్ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నానని.. ఇక్కడి నుంచి ఎక్కువగా చైనాకు ఎగుమతులు జరుగుతుంటాయని చెప్పారు. కానీ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా చైనా లాక్ డౌన్ ప్రకటించడంతో తమ కంపెనీ ఉత్పత్తులను నిలిపివేసిందన్నారు. ఫ్యాక్టరీ మూతపడటంతో తాము రోడ్డునపడ్డామని చెప్పారు. తనతో పాటు వందలాది కార్మికులు రోడ్డుపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM)ఏమంటోంది..
తాము పనిచేసే సంస్థ తమపై దయ చూపలేదని.. ఇప్పుడు అటు ఇంటికి కాకుండా.. ఇక్కడ పని లేకుండా.. దారుణ పరిస్థితుల్లో చిక్కుకుపోయామని వాపోయారు. ఉద్యోగం లేకపోవడంతో నెలవారీ ఖర్చులను ఎలా వెళ్లదీయాలో అర్థంగాక సతమతమవుతున్నట్టు చెప్పారు. తన భర్త పనిచేస్తున్నప్పటికీ.. షట్ డౌన్ కారణంగా... అతని పని గంటలు కూడా తగ్గించేశారని.. దీంతో కొద్దిపాటి వేతనమే వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ కొద్దిపాటి వేతనంతో ఖర్చులు,కుటుంబ పోషణ భారమవుతుందన్నారు. ఒకవేళ మయన్మార్కి వెళ్లిపోతే తిరిగి వచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చునని అన్నారు.ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్ డౌన్ ప్రకటించడంతో ఎక్కువగా ఇబ్బందిపడుతున్నది వలస జీవులేనని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) వెల్లడించింది. ఇక అక్రమ వలసదారుల పరిస్థితి మరింత దారుణమని పేర్కొంది. ఇలాంటి సమయంలో వారు మరిన్ని వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మయన్మార్,కాంబోడియా,లావోస్ వంటి దేశాలు కరోనాను ఎదుర్కొనేందుకు సన్నద్దంగా లేవని తెలిపింది. దాంతో ఆ దేశాలు వలస వెళ్లినవారు తిరిగి వచ్చేందుకు అనుమతించట్లేదని పేర్కొంది.

థాయిలాండ్లో ఏప్రిల్ 30వరకు లాక్ డౌన్.. వాళ్ల పరిస్థితేంటి..
థాయిలాండ్లో చిక్కుకుపోయిన లక్షలాది మంది వలస కార్మికులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వలస కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్న సుతాసిని మాట్లాడుతూ.. ఓవైపు కరోనా భయం,మరోవైపు పనిలేదన్న ఆందోళన.. అన్ని కలిపి వలస జీవుల జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పారు. బ్యాంకాక్లో భవన నిర్మాణం రంగం నుంచి హోటల్స్,ఫ్యాక్టరీలు,హౌజ్ కీపింగ్.. ఇలా ప్రతీ రంగంలోనూ వలస కార్మికులే ఉన్నారని చెప్పారు. ఇలాంటి సంక్షోభ సమయంలో థాయి ప్రభుత్వం నుంచి వీరికి మద్దతు కరువైందన్నారు. తాత్కాలికంగా వీసా గడువు పెంచడం,'జాబ్లెస్ పాలసీ'కి దరఖాస్తు చేసుకోవడం వంటి చర్యలు తప్ప ఇంకేమీ చేయలేదన్నారు. ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉండటంతో.. అప్పటివరకు తమ ఆగ్రహాన్ని,ఆవేశాన్ని చంపుకుని కడుపు మాడ్చుకుంటూ నిస్సహాయంగా బతకడమేనని మా మో లాంటి చాలామంది వాపోతున్నారు.












Click it and Unblock the Notifications