కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఉద్యోగుల జీతాలపై విజయ్ మాల్యా ఏమన్నారంటే?
లండన్: బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లను తీరుస్తానని లేఖ రాసిన విజయ మాల్యా తన కంపెనీ కింగ్ ఫిషర్లో పని చేసిన ఉద్యోగుల జీతాలు కూడా చెల్లిస్తానని చెప్పారు. కింగ్ ఫిషర్లో పనిచేసిన ఉద్యోగుల్లో ఓ వర్గం తమకు వేతనాలు చెల్లించలేదంటూ పదేపదే ఫిర్యాదులు చేసింది. దీనిని కూడా మాల్యా ప్రస్తావించారు.
ఇక నేనేం చేయాలి?: మోడీపైకి నెట్టిన విజయ్ మాల్యా! సంచలన విషయాలు వెల్లడి
ఉద్యోగుల జీతాల అంశం తనను కలిచివేసిందని, ఎందుకంటే కింగ్ ఫిషర్ ఓ వెలుగు వెలుగుతోన్న సమయంలో మన దేశంలోని ఏ విమానయాన సంస్థ ఉద్యోగులకు దక్కని సంతోషాన్ని, సంతృప్తిని కింగ్ ఫిషర్ ఉద్యోగులు అనుభవించారని, అయితే ఆ తర్వాత కంపెనీ పరిస్థితి తారుమారయిందని, ఆ ప్రభావం ఉద్యోగులపై పడిందన్నారు.
యూబీ గ్రూబ్లో సారథ్యంలో సుమారు 66,000 మంది ఉద్యోగులు ఉండేవారని, వీళ్లలో చాలామంది 20-30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నవాళ్లేనని, ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేకుంటే వారు ఇన్నేళ్ల పాటు ఎలా పని చేస్తారని అడిగారు. అయినా కాని కింగ్ ఫిషర్ ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు ప్రయత్నించానని, చట్టపరంగా వీలులేనప్పటికీ తన వినతి మేరకు ఉద్యోగుల వేతనాల్లో కొంత చెల్లించేందుకు 2014 ప్రారంభంలో సుప్రీంకు యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ ఓ దరఖాస్తు సమర్పించిందన్నారు.
కానీ దరఖాస్తు పెండింగ్లో ఉందన్నారు. విచారణకు కూడా రాలేదని చెప్పారు. కనీసం కర్ణాటక హైకోర్టు వద్ద డిపాజిటు చేసిన రూ.1280 కోట్లపై వడ్డీని అయినా ఉద్యోగుల వేతనాల చెల్లింపుకు అనుమతినిస్తే తాను సంతోషించేవాడినని, అలా జరగలేదన్నాడు.