కొనసాగుతున్న హరికేన్ హార్వే బీభత్సం, భారతీయ విద్యార్థి మృతి, రంగంలో 12 వేల మంది నేషనల్ గార్డ్స్
టెక్సాస్ లో హార్వే హరికేన్ వరద ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. కుండపోత వర్షాల కారణంగా టెక్సాస్, లూసియానాలోని నివాస ప్రాంతాల్లోకి నీరు చేరడం.
వాషింగ్టన్: టెక్సాస్ లో హార్వే హరికేన్ వరద ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. కుండపోత వర్షాల కారణంగా టెక్సాస్, లూసియానాలోని నివాస ప్రాంతాల్లోకి నీరు చేరడం, గంటగంటకు నీటిమట్టం పెరుగుతుండటంతో లక్షలాది ప్రజలు ఇళ్ల పైకప్పులపై చేరి సహాయంకోసం ఎదురు చూస్తున్నారు.
గురువారం నాటికి మరో 60.96 సెంటీ మీటర్ల వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని జాతీయ వాతావరణ సంస్థ (ఎన్డబ్ల్యూఎస్) ప్రకటించిన నేపథ్యంలో హ్యూస్టన్లోని ప్రభుత్వ ఆఫీసులు, పాఠశాలలు, ఎయిర్పోర్టులను మూసివేశారు.
ఒకే కుటుంబంలో ఆరుగురు, మొత్తం 10 మంది మృతి...
వరదలవల్ల సోమవారం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురితో సహా మొత్తం పది మంది మృతి చెందారు. హ్యూస్టన్, న్యూఆర్లియన్స్ నగరాల్లో 1.3 కోట్ల మంది ఇప్పటికీ వరదల్లో చిక్కుకుని ఉన్నారు. ఇప్పటికే 5,500 మందిని సహాయ శిబిరాలకు తరలించామని హ్యూస్టన్ మేయర్ తెలిపారు.
రంగంలోకి 12 వేల మంది నేషనల్ గార్డులు...
మరో 30 వేల మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారని భావిస్తున్నా రు. 12 వేల మంది నేషనల్ గార్డులు, 16 విమానాలు నిరంతరం సహాయ చర్యలను కొనసాగిస్తున్నాయని టెక్సాస్ గవర్నర్ చెప్పారు. విద్యుత్తు సదుపాయాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
పరిశ్రమలకు బిలియన్ డాలర్ల నష్టం...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే లూసియానాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. వరదల వల్ల ఆయిల్, గ్యాస్ పరిశ్రమలకు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని, దెబ్బతిన్న పరిశ్రమలను పునరుద్ధరించేందుకు చాలా సమయం పడుతుందని, పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడేందుకు చాలా సమయం పడుతుందని, అమెరికన్లు ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ఐక్యతను చాటుకుంటున్నారని, సహాయ సిబ్బంది బాగా పనిచేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
భారతీయ విద్యార్థులు సురక్షితం...
వరదల్లో చిక్కుకున్న యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్కు చెందిన 200 మంది భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. భారీ వరదల కారణంగా విద్యార్థులు ఉండే భవనాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీంతో వారు అపార్ట్మెంట్ పైకప్పు మీద ఉండిపోయారు.
స్వయంగా పరిశీలించిన భారత కాన్సులేట్ జనరల్...
హ్యూస్టన్లోని భారత కాన్సులేట్ జనరల్ అనుపమ్ రే స్వయంగా వీరు ఉంటున్న అపార్టుమెంట్ వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఫేస్బుక్ ద్వారా సమాచారం తెలుసుకున్న ఇండియన్ అమెరికన్ సంస్థలు వారికి భోజనం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నాయి.
జైపూర్ విద్యార్థి మృతి, విద్యార్థిని పరిస్థితి విషమం...
మరోవైపు సెయింట్ జోసెఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏఅండ్ఎం యూనివర్సిటీకి చెందిన భారతీయ విద్యార్థి నిఖిల్ భాటియా(24) బుధవారం మృతి చెందగా, అతడి స్నేహితురాలైన మరో విద్యార్థిని షాలినీ సింగ్(25) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. నిఖిల్ భాటియా జైపూర్ వాసి కాగా షాలినీ సింగ్ న్యూఢిల్లీకి చెందినది. వీరిద్దరూ పబ్లిక్ హెల్త్ లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఆ యూనివర్సిటీలో చేరారు. భారత కాన్సులేట్ నుంచి సమాచారం అందగానే నిఖిల్ భాటియా తల్లి డాక్టర్ సుమన్ భాటియా డల్లాస్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
తుఫానులో ఈతకు వెళ్లడమేంటి?
భారతీయ విద్యార్థులు నిఖిల్ భాటియా, షాలినీ సింగ్ ఇద్దరూ శనివారం బ్రయాన్ సరస్సులో ఈతకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్నట్లు సహ విద్యార్థుల ద్వారా తెలిసింది. వారిని రక్షించిన పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిఖిల్ భాటియా మరణించాడు. హరికేన్ అతలాకుతలం చేస్తున్న తరుణంలో వీరు ఈతకు ఎందుకెళ్లారో అర్థం కావడం లేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
భారతీయుల సహాయార్థం హెల్ప్లైన్ నంబర్...
హ్యూస్టన్లో లక్ష మంది భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు. వీరి నివాసాలు పూర్తిగా వరద జలాలతో నిండిపోయాయి. కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లగా.. మరికొందరు నేటికీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. భారతీయుల సహాయార్థం ఓ హెల్ప్లైన్ నంబర్ను కూడా హూస్టన్లోని భారత కాన్సుల్ జనరల్ అనుపమ్ రే ట్వీటర్లో పోస్ట్ చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్రంప్ పర్యటన...
హార్వీ తుపాను నేపథ్యంలో టెక్సాస్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాతావరణ అత్యవసర స్థితిని ప్రకటించారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ట్రంప్ తన భార్య మెలానియాతో కలసి టెక్సాస్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం (అమెరికా కాలమానం ప్రకారం) పర్యటిస్తారనీ, సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి.
కార్పస్ క్రిస్టీ ప్రాంతంలో ట్రంప్, మెలానియా...
ట్రంప్ మాట్లాడుతూ ‘తుఫానులో చిక్కుకున్న వారికి అమెరికాలోని ప్రతి వ్యక్తీ తమ మద్దతును, ప్రేమను పంపుతున్నారు. తుఫానును ఎదుర్కొని మనం మరింత శక్తిమంతులుగా ఎదుగుతాం' అని అన్నారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న హూస్టన్లో కాకుండా.. హార్వీ శుక్రవారం తీరాన్ని తాకిన కార్పస్ క్రిస్టీ ప్రాంతంలో ట్రంప్ దంపతులు పర్యటించనున్నారు.