'మృత్యువును అతి దగ్గరగా చూశా': 160 మంది ఊచకోత
పెషావర్: తమ పాఠశాలపై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేసి విద్యార్థులను చంపిన సంఘటన నుంచి బయటపడిన ఓ విద్యార్థి తన అనుభవాన్ని పంచుకున్నాడు. రెండు కాళ్లపై కాల్పులు జరిపిన తర్వాత తాను మరణించినట్లు పడుకున్నానని చెప్పాడు. విద్యార్థులను ఉగ్రవాదాలు వేటాడుతుంటే తాను మరణించినట్లు నటిస్తూ పడుకున్నట్లు చెప్పాడు.
ఆ పదహారేళ్ల విద్యార్థి షారూక్ ఖాన్ పెషావర్లోని లేడీ రీడింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పడక మీది నుంచే అతను తన అనుభవాన్ని వివరించాడు. తాను తన తరగతి విద్యార్థులు పాఠశాల ఆడిటోరియంలో కెరీర్స్ గైడెన్స్ సెషన్లో ఉండగా పారా మిలిటరీ యూనిఫారాలు ధరించిన నలుగురు సాయుధులు వచ్చారని చెప్పాడు.
ఎవరో గట్టిగా కేకలు వేస్తూ డెస్క్ల కింద దాక్కోవాలని చెప్పారని, కాల్పులు జరపడానికి ముందు సాయుధులు అల్లాహో అక్బర్ అంటూ అరిచారని అతను చెప్పాడు. అంతలో వారిలోని ఒకతను బెంచీల కింద చాలా మంది పిల్లలు ఉన్నారని, వారిని తీసుకురండని అన్నాడని ఖాన్ ఎఎఫ్పికి చెప్పినట్లు పిటిఐ వార్తా సంస్థ తెలిపింది.
భారీ నల్ల బూట్లు తన వైపు రావడం చూశానని, బెంచీల కింద దాక్కున పిల్లల కోసం అతను వేటాడుతుండడవచ్చునని అతను అన్నాడు. బాధను దిగమింగుతూ మోకాళ్లకు దిగువ తన రెండు కాళ్లపై కాల్పులు జరిపాడని చెప్పాడు. దాంతో మరణించినట్లు నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
టైని మడిచి నోట్లో పెట్టుకున్నానని, శబ్దం బయటకు రాకుండా ఉంటుందని ఉద్దేశంతో అలా చేశానని అతను చెప్పాడు. భారీ బూట్ల వ్యక్తి విద్యార్థుల కోసం చూస్తూ వారి శరీరంలోకి బుల్లెట్లను కురిపిస్తూ వెళ్లాడని, కళ్లు మూసుకుని బుల్లెట్ శబ్దం కోసం ఎదురు చూస్తున్నానని అతను అన్నాడు.
తన శరీరం వణుకుతోందని, మృత్యువును అతి సమీపంగా చూశానని, తన వైపు వచ్చిన నల్ల బూట్లను తాను జీవితంలో మరిచిపోలేనని, మృత్యువు తనవైపు వస్తున్నట్లు అనిపించిందని అతను అన్నాడు. ఈ ఆర్మీ స్కూల్లో మిలిటరీ, సివిల్ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు చదువుకుంటారు.
సాయుధులు వెళ్లిపోయిన తర్వాత కాసేపటికి నించోవడానికి ప్రయత్నించానని, నించుకోవడానికి ప్రయతిస్తూ పడిపోతూ వచ్చానని, గాయాల కారణంగా నించులేకపోయానని చెప్పాడు. తర్వాతి గది వరకు పాకుతూ వెళ్లానని, చూస్తే భయానకంగా ఉందని, మంటల్లో తమ ఆఫీస్ అసిస్టెంట్ శవాన్ని చూశానని షారూక్ చెప్పాడు.
కుర్చీపై కూర్చునే మంటల్లో కాలింది..
తమ ఆఫీస్ అసిస్టెంట్ కుర్చీపై కూర్చుని రక్తమోడుతూ మంటల్లో చిక్కుకుందని అతను చెప్పాడు. పాఠశాల వద్ద పనిచేసే సైనికుడి శవాన్ని కూడా తాను చూసినట్లు తెలిపాడు. తలుపు వెనక్కు పాక్కుంటూ వెళ్లి తాను దాక్కున్నట్లు తెలిపాడు. స్పృహ కోల్పోయానని చెప్పాడు. స్పృహ వచ్చేసరికి ఆస్పత్రి పడక మీద ఉన్నట్లు తెలిపాడు.
160 దుర్మరణం
పాకిస్తాన్లోని పెషావర్ పాఠశాలపై జరిగిన అతి కిరాతకమైన ఉగ్రవాద దాడిలో 160 మంది మరణించారు. వారిలో చాలా మంది పాఠశాల పిల్లలే. పాఠశాలలోకి ప్రవేశించి మారణకాండ సృష్టించిన ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పిల్లలను తాలిబన్లు కవచంగా చేసుకుని దాడులు సాగించారు. ఘటనలో 122 మంది గాయపడ్డారు. మిలిటెంట్లలో నలుగురు ఆత్మాహుతి దళ సభ్యులు తమను తాము పేల్చుకుని మరణించగా, ఇద్దరిని సైన్యం మట్టుబెట్టింది.