రంగంలోకి వాయుసేన: ఐఏఎఫ్ సీ-17 సేవలు, రొమెనియా నుంచి తరలింపు
రష్యా ఉక్రెయిన్ యుద్దం వల్ల సిచుయేషన్ దారుణంగా ఉంది. దీంతో ఉక్రెయిన్లో ఉన్న పౌరులను తీసుకొచ్చే ప్రయత్నాలను ఆయా దేశాలు చేస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో.. పొరుగున ఉన్న రొమోనియా.. ఇతర దేశాల గుండా జనం స్వదేశం చేరుకుంటున్నారు. ఇండియా కూడా ఆపరేషన్ గంగా చేపట్టింది. ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశం తీసుకొస్తోంది. అయితే ఇవాళ నవీన్ అనే భారతీయుడు మరణంతో ఉత్కంఠ నెలకొంది. అక్కడ ఉన్న మిగతా వారిని యుద్దప్రాతిపదికన తీసుకురావాలని భారత్ అనుకుంటుంది.
Recommended Video
రష్యాతో యుద్ధం కారణంగా భీతావహ పరిస్థితులు నెలకొన్న ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ శాఖ మంత్రి, ఆ శాఖ అధికారులతో భేటీలు నిర్వహించారు. తాజాగా మంగళవారం సాయంత్రం కూడా మరో దఫా బేటీ అయ్యారు. భారత రక్షణ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు వాయు సేనను రంగంలోకి దించాలని ప్రధాని ఆదేశించారు. వాయుసేనకు చెందిన సీ-17 విమానాల ద్వారా త్వరితగతిన ఉక్రెయిన్లోని భారతీయులను దేశానికి తరలించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెంటనే రంగంలోకి దిగిపోయింది. విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఉక్రెయిన్లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు సీ-17 విమానాలను ఉక్రెయిన్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను అక్కడి నుంచి తరలించేందుకు సహకరించాలని అటు ఉక్రెయిన్తో పాటు ఇటు రష్యాను కోరాలని విదేశాంగ శాఖకు మోడీ ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఆ రెండు దేశాలతో విదేశాంగ శాఖ చర్చలు ప్రారంభించింది. ఉక్రెయిన్లోని భారతీయుల కోసం సీ-17 విమానాలు ఏ క్షణంలో అయినా టేకాఫ్ తీసుకునేందుకు రంగం సిద్ధమైపోయింది.