'దేశంలో ఉండనివ్వం': ముస్లిం స్త్రీలకు ఇంగ్లీష్ టెస్ట్
లండన్: బ్రిటన్కు వలసవచ్చే ఇతర దేశాలకు చెందిన ప్రజలు రెండు లేదా రెండున్నర సంవత్సరాల్లోపు ఇంగ్లీషు నేర్చుకోకపోతే దేశంలో ఉండేందుకు అనుమతించబోమని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ తెలిపారు. బ్రిటన్లో నివసించే లక్షా 90వేల మంది ముస్లిం మహిళలకు ఇంగ్లీ రాదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
ఓ వార్త పత్రికకు రాసిన వ్యాసంలో కామెరూన్ ఇంగ్లీషు భాష ఆవశ్యకతను వివరించారు. 'కొద్దిపాటి ఇంగ్లీష్ నేర్చుకుని బ్రిటన్కు వలసరావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఇంగ్లీషు భాషపై పట్టుసాధించకపోతే దేశంలో నివసించే అవకాశాన్ని కోల్పోతారు' అని పేర్కొన్నారు.
ఇంగ్లీష్ భాష నైపుణ్యానికి, తీవ్రవాదానికి సంబంధం లేకపోయినా, బ్రిటీష్ సమాజంతో ఇమడలేని కొంత మంది తీవ్రవాద భావజాలానికి ఆకర్షితులయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని కామెరూన్ ఈ వ్యాసంలో పేర్కొన్నారు. బ్రిటిష్ సమాజంతో కలవలేక పోతున్న వారికి ఇంగ్లీషు భాష నేర్చుకోవడం లాంటి చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
ఇతర మతాలకు చెందిన మహిళలకు ఇంగ్లీష్ భాష నేర్పించేందుకు బ్రిటన్లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకోసం బ్రిటన్ ప్రభుత్వం 20 లక్షల పౌండ్లు ఖర్చు చేస్తోంది. కాగా, ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రత్యేక వీసాపై బ్రిటన్కు వచ్చిన వారి ఇంగ్లీష్ భాష నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.
బ్రిటన్లో అడుగుపెట్టిన రెండు లేదా రెండున్నర సంవత్సరాల్లోపు ఇంగ్లీషు పరీక్ష పాస్ కాకపోతే వారు వారి సొంత దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆ దంపతులకు పుట్టిన పిల్లలు మాత్రం తమ తండ్రితో బ్రిటన్లో ఉండేదుకు అనుమతి ఉంది. కామెరూన్ ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముస్లిం మహిళలే ఎక్కువ ఇబ్బందుల పడవచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు.