బిన్ లాడెన్పై భక్తి చాటుకున్న ఇమ్రాన్.. పాకిస్తాన్ పార్లమెంటులో భజన.. అమెరికాపై ఆగ్రహం..
ఉగ్రవాదుల కార్ఖానాగా పేరుపొందిన పాకిస్తాన్ కు ఆ బిరుదు దక్కడం కరెక్టేనని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిరూపించారు. అంతర్జాతీయ ఉగ్రవాది, 9/11 దాడులకు సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ పై తనకున్న భక్తిని మరోసారి చాటుకున్నారు. ఏకంగా పాకిస్తాన్ పార్లమెంటులోనే ఉగ్రనేతను అమరవీరుడంటూ పొగిడేశారు. అమెరికాతో పాక్ సంబంధాలపై మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు. ఇదే ఇమ్రాన్ కేబినెట్ మంత్రి భారత్ ను ఉద్దేశించి అనూహ్య వ్యాఖ్యలు చేశారు.

ఉగ్రవాది కాదు.. యోధుడు..
ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందు నుంచే ఒసామా బిన్ లాడెన్ ను ఆరాధిస్తోన్న ఇమ్రాన్ ఖాన్.. గతంలో అమెరికా, బ్రిటన్ లో పర్యటించిన సందర్బాల్లోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఒసామాను ఎవరైనా ఉగ్రవాది అంటే తాను ఒప్పుకోబోనని, వెస్ట్రన్ దేశాల దృష్టిలో మాత్రమే లాడెన్ ఉగ్రవాది అవుతాడుతప్ప.. మిగతా వాళ్లందరూ ఆయనను స్వాతంత్ర్య సమర యోధుడిగానే గుర్తిస్తారని ఖాన్ పేర్కొన్నారు. గురువారం జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ ఒసామాను షహీద్ గా కీర్తించారు.

ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు..
అఫ్గానిస్తాన్ పై యుద్ధంలో అమెరికాకు సాయం చేసినందుకుగానూ పాకిస్తాన్ ఇంటా, బయటా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత అంతర్జాతీయ వేదికలపైనా అవమానాల్ని చవిచూశామని ప్రధాని ఇమ్రాన్ పేర్కొన్నారు. అమెరికాతో సంబంధాల్లో పాకిస్తాన్ కు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని గుర్తుచేశారు. అయితే, తాను అధికారంలోకి వచ్చాక పరిస్థితుల్ని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నానని, పాకిస్తాన్ పై ఉగ్రమచ్చను చెరిపేయడానికి కృషి చేస్తున్నానని ఖాన్ చెప్పుకొచ్చారు.

లాడెన్ జాడ చెప్పింది మేమే..
వీలైనప్పుడల్లా మీడియా ముందు లాడెన్ ప్రస్తావన తీసుకురావడం ఇమ్రాన్ కు అలవాటైన పని. గతేడాది అమెరికాలో పర్యటిస్తున్న సమయంలో అక్కడి విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ.. బిన్ లాడెన్ అబోటాబాద్లో తలదాల్చుకున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వమే అమెరికాకు చెప్పిందని, అయితే లాడెన్ను చంపడానికి రహస్య ఆపరేషన్ చేయకూడదని కోరినా అమెరికా వినిపించుకోలేదని ఇమ్రాన్ గుర్తుచేశారు. ఆ ఘటనతో పాక్ పరువు దిగజారిందని చెప్పడానికి తాను సంకోచించబోనని అన్నారు. ఇదిలా ఉంటే,

దాడులకు భారత్ ప్లాన్..
చైనాకు ఆప్తురాలిగా వ్యవహరించే పాకిస్తాన్.. భారత్ పట్ల తన శత్రువైఖరిని కొనసాగిస్తున్నది. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో చైనా చేతిలో భారత జవాన్లు హతమైన తర్వాత మోదీ సర్కారుపై ఒత్తిడి పెరిగిందని, ప్రతిపక్ష పార్టీలు కూడా కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి నెలకొందని, చైనా ఇష్యూ నుంచి జనం దృష్టిని మరల్చేందుకు.. పాకిస్తాన్ పై మెరుపు దాడులకు భారత్ ప్లాన్ చేస్తోందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గూఢచర్యానికి పాల్పడిన కారణంగా న్యూఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ అధికారులపై భారత్ వేటేయడం, సిబ్బందిని 50 శాతానికి తగ్గించాలని ఆదేశించడం, అదే సమయంలో ఇస్లామాబాద్ లోని ఇండియన్ ఎంబసీ సిబ్బందిలో 50 శాతం మందిని వెనక్కి రావాల్సిందిగా పిలుపునిచ్చిన నేపథ్యంలో రెండు దేశాల దౌత్య సంబంధాలు మళ్లీ క్షీణించాయి. ఆ నేపథ్యంలోనే ఖురేషీ దాడి కామెంట్లు చేశారు.












Click it and Unblock the Notifications