ముదురుతున్న వాణిజ్యవార్: ఆ చైనా ఉత్పత్తులపై సుంకం పెంచుతూ ట్రంప్ నిర్ణయం
అమెరికా: అమెరికా చైనాల మధ్య వాణిజ్య వార్ ముదురుతోందా..? గత కొద్దిరోజులుగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా చైనా ఖంగుతినింది. ఇంతకీ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏమిటి...? చైనాకు ఎలాంటి షాక్ ఇచ్చారు.
చైనా అమెరికాల మధ్య ముదురుతున్న వాణిజ్య వార్
అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలు మందగిస్తున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. అమెరికాలో 200 బిలియన్ డాలర్ల మేరా విలువ చేసే చైనా వస్తువులపై సుంకం 25శాతం పెంచుతున్నట్లు చెప్పారు. బుధవారం చర్చల కోసం చైనా నుంచి బృందం అమెరికాకు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా చైనాల మధ్య గత కొన్ని నెలలుగా వాణిజ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బుధవారం చివరిసారిగా అమెరికాతో చర్చలు జరిపేందుకు చైనా బృందం అగ్రరాజ్యానికి బయలుదేరనుంది.
చైనా ఉత్పత్తులపై 25శాతం సుంకం పెంపు
గత 10 నెలలుగా అమెరికాలో చైనా వస్తువుల అమ్మకాలపై డ్రాగన్ కంట్రీ సుంకం కడుతూ వస్తోంది. ఇందులో 50 బిలియన్ డాలర్లు విలువ చేసే హైటెక్ వస్తువులపై 25 శాతం సుంకం చెల్లిస్తుండగా... 200 బిలియన్ డాలర్లు విలువ చేసే ఇతర వస్తువులపై 10శాతం సుంకం చెల్లిస్తోంది చైనా. ఇక ఈ 10శాతం వచ్చే వారం నుంచి 25 శాతానికి పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. చైనాలో అమెరికా వస్తువులపై... అమెరికాలో చైనా వస్తువులపై సుంకం విధించే క్రమంలో రెండు దేశాలు వాణిజ్య యుద్ధానికి తెరతీశాయి. అయితే ఇది తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ట్రంప్ జింగ్పింగ్లు ఒక సంధి కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యారు. గతవారమే ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు సాఫీగా సాగుతున్నాయని అమెరికా ప్రకటించిన కొద్దిరోజులకే ట్రంప్ బాంబు పేల్చడంతో చైనా ఖంగు తినింది.
అమెరికాపై చైనా ఒత్తిడే కారణమా..?
చైనా అమెరికాల మధ్య ఉన్న వాణిజ్య లోటును భారీగా తగ్గించాలన్న ఆలోచనతో ఉన్నట్లు ట్రంప్ చెప్పారు. చైనాలో అమెరికా ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉన్నప్పటికీ... ట్రంప్ మాత్రం క్షేత్రస్థాయిలో మార్పులు జరగాలని పట్టుబడుతున్నారు. ఇందుకు కారణం కూడా ఉంది. అమెరికా కంపెనీలు తమ టెక్నాలజీని చైనాతో పంచుకోవాలని చైనా పదేపదే ఒత్తిడి తీసుకురావడం సరికాదని ట్రంప్ చెబుతున్నారు. అంతేకాదు చైనా విదేశీ సంస్థల ఆస్తులను లాక్కోవడం, సబ్సీడీలు ఇవ్వకుండా చేయడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. అందుకే చైనాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అమెరికాలోకి ప్రవేశిస్తున్న చైనా ఉత్పత్తులపై ట్రంప్ సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చైనా ఉత్పత్తుల విలువ 539.5 బిలియన్ అమెరికా డాలర్లు ఉంటుంది.