అక్కడ లీటర్ పాలు ఎంతో తెలుసా..? పెట్రోల్, డీజిల్ కూడా చవకే...
కరాచీ : పాలు.. నిత్యజీవితంలో విరివిగా వాడుతుంటాం. ప్రతీ ఇంటిలో ఉదయం టీ, కాఫీ నుంచి స్వీట్, పెరుగు కోసం పాలు తప్పనిసరి. పాలలో పౌష్టికాహారం అధికంగా ఉండటంతో పిల్లలకు పాలు ఇచ్చేందుకు పేరెంట్స్ ఆసక్తి చూపిస్తుంటారు. వైద్యులు కూడా పాలు ఇవ్వాలని సజెస్ట్ చేస్తుంటారు. సాధారణంగా పండగలు వస్తే పూల, పళ్ల ధరలు రెక్కలను చేరుతుంటాయి. కొన్నిచోట్ల పాల ధరలు కూడా చుక్కలనంటున్నాయి.
పండగకో విశిష్టత ..
కొన్ని పండుగలకు విశిష్టత ఉంటుంది. ఏ పండుగకు ఆ పాలు, ఫలాలు అందిస్తుంటారు. ఇదీ ఇస్లాంలో మరి ఎక్కువ. ఇటీవల మొహర్రం పండుగ అయిపోయింది. మొహర్రం సందర్భంగా పేదలకు పాలు ఇస్తుంటారు కొందరు. ముఖ్యంగా ముస్లింలు అధికంగా ఉండే పాకిస్థాన్లో పట్టింపులు ఎక్కువే .. పేదలకు పాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఈసారి చాలామంది అందుకు విముఖత వ్యక్తం చేశారు. ఎందుకో తెలుసా .. అక్కడ పాల ధర ఆకాశానికి అంటడమే. అవును మొహర్రం సందర్భంగా లీటర్ పాలు రూ.140కి చేరింది. దీంతో పాలు కొనేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించలేదు.
కరాచీ, సింధులో ..
పాకిస్థాన్లోని కరాచీ, సింధు రాష్ట్రాల్లో ధరల ప్రభావం ఎక్కువగా ఉంది. విచిత్రమేమిటంటే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పాల కన్నా తక్కువగా ఉంది. లీటర్ పాల ధర రూ.140 ఉంది. దీంతో సామాన్యుడు నోరెళ్లబెట్టారు. లీటర్ పెట్రోల్ రూ.113 ఉండగా, లీటర్ డీజిల్ రూ.91కి చేరింది. పెట్రోల్ ధర కన్నా పాలు ఎక్కువకు చేరడంతో వినియోగదారులు గగ్గోలు పెట్టారు. లీటర్ పాల ధర రూ.120 నుంచి రూ. 140కి చేరింది. దీంతో మొహర్రం సందర్భంగా ఇచ్చే పాలను కొందరు ఇచ్చేందుకు నిరాకరించారు.
మొహర్రం రోజున ..
మొహర్రం పండుగ సందర్భంగా ముస్లింలు .. స్టాల్స్ వద్ద పాలు పెడుతుంటారు. పాలతోపాటు జ్యూస్ కూడా ఇస్తున్నారు. సబిల్ (స్టాల్) ఏర్పాటుచేసి విక్రయిస్తుంటారు. వినియోగదారులు పాలు కొని .. ఇస్తుంటారు. కానీ ఈ సారి వినియోగదారులు కొనే సాహసం చేయలేదు. మరికొందరు స్టాల్స్ కూడా ఏర్పాటు చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. దీనిపై పాకిస్థాన్ వర్గాలు స్పందిస్తూ .. వాస్తవానికి పాల కేంద్రాల్లో లీటర్ పాలు రూ.94కి అందజేశామని పేర్కొన్నారు. కొన్నిచోట్ల కొందరు అధిక ధరకు విక్రయించారని.. ఇది తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.